రైతుల పేరుతో డ్రామాలు ఆపాలి
ప్రతిపక్షాల ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే
అసత్య ప్రచారాలు నమ్మవద్దు
మార్కేట్ ఛైర్మన్ రావుల హరీష్ రెడ్డి
కాకతీయ, నెక్కొండ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమై వాస్తవాలకు దూరమని నెక్కొండ మండల కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం నెక్కొండలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్ చౌహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మార్కెట్ చైర్మన్ రావుల హరిష్ రెడ్డి, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మార్కెట్ చైర్మన్ రావుల హరిష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులకు రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే తమ పదేళ్ల పాలనలోనే పరిష్కారాలు చూపాల్సిందని మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్ మాట్లాడుతూ, మొక్కజొన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే మరో రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లావుడ్యా తిరుమల్ చౌహన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ రైతులకు శాశ్వత పరిష్కారాలు చూపడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల పేరుతో ప్రచారం ఎక్కువ చేసి, రైతులను మాత్రం రోజుల తరబడి నిరీక్షింపజేసిందన్నారు. తూకంలో ఆలస్యం, చెల్లింపుల్లో జాప్యం, మధ్యవర్తుల దోపిడీ వంటి సమస్యలను పరిష్కరించలేక రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకొని కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రతిపక్ష నేతలు ధర్నాల పేరుతో రాజకీయ డ్రామాలు చేయడం మానుకొని, గతంలో రైతులకు చేసిన అన్యాయాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి రైతుల పక్షాన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల పెంపు, మద్దతు ధర కల్పన, చెల్లింపుల వేగవంతంపై ఇప్పటికే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, మొక్కజొన్న రైతులకు పూర్తి న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, కొనిజేటి బిక్షపతి, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయి కృష్ణ, కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, భూక్య రమేష్, మార్కెట్ డైరెక్టర్లు, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

