మహిళా రిజర్వేషన్లపై మోదీ సాహసోపేత అడుగు
నియోజకవర్గాల విభజనతో దక్షిణాదికి నష్టం లేదు
రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఎప్పుడూ వ్యతిరేకమే
నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కాకతీయ,ఖమ్మం : భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా సాధికారతకు బాటలు వేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) ఒక సువర్ణ అధ్యాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. గత 27 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ అంశానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపారని, దీనిని కేవలం రాజకీయ కోణంలో కాకుండా సామాజిక మార్పుగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఖమ్మంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన, జనగణన ప్రక్రియల ద్వారానే మహిళలకు దక్కాల్సిన 33 శాతం రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా అమలు కాగలవని సోదాహరణంగా వివరించారు.
పునర్విభజనతోనే మహిళా కోటాకు సంపూర్ణ న్యాయం
మహిళా రిజర్వేషన్ బిల్లు లేదా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, గతంలో తొమ్మిది సార్లు ఈ బిల్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ చిత్తశుద్ధి లేకపోవడం వల్లే అవి చట్టం కాలేదని విమర్శించారు. ఈ బిల్లు అమలు అనేది జనగణన,నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానాలను తగ్గించకుండా, సీట్ల సంఖ్యను పెంచడం ద్వారానే పురుష సభ్యులకు అన్యాయం జరగకుండా మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించవచ్చని, ఇందుకోసం డీలిమిటేషన్ తప్పనిసరి అని విశ్లేషించారు. పార్లమెంటులో ఈ బిల్లును దాదాపు అందరూ మద్దతు తెలపగా, కేవలం ఇద్దరు సభ్యులు (అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్ జలీల్) మాత్రమే వ్యతిరేకించారని గుర్తు చేశారు.
దక్షిణాదికి అన్యాయమన్నది విపక్షాల అపోహే
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్న విమర్శలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి గణాంకాలతో తిప్పికొట్టారు. గత చరిత్రను ఉదహరిస్తూ, కాంగ్రెస్ హయాంలో జరిగిన పునర్విభజనల సమయంలోనే దక్షిణ భారత్ సీట్ల కేటాయింపులో తీవ్రంగా నష్టపోయిందని నిరూపించారు. 1963లో జరిగిన రెండవ పునర్విభజనలో ఉత్తర భారత్కు 29 సీట్లు పెంచగా, దక్షిణ భారత్కు కేవలం 2 సీట్లు (నికరంగా) మాత్రమే పెంచారని, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో సీట్ల తగ్గింపు జరిగిందని ఎత్తిచూపారు. ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా గారు పార్లమెంటులో చెప్పినట్లుగా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా సీటు తగ్గదని, పైగా దక్షిణాది రాష్ట్రాలకు 0.1 నుండి 0.2 శాతం వరకు అదనపు ప్రయోజనమే కలుగుతుందని భరోసా ఇచ్చారు. ఓటర్ల పెరుగుదలను గమనిస్తే, నియోజకవర్గాల సంఖ్య పెరగడం అనివార్యమని ఎంపీ పేర్కొన్నారు. 1971లో ప్రతి ఎంపీకి సగటున 10 లక్షల మంది ఓటర్లు ఉండేవారు. ఉత్తరప్రదేశ్లో 10.03 లక్షలు, బీహార్లో 10.03 లక్షల మంది ఓటర్లు ఉండేవారు. అయితే 2024 నాటికి ఈ సాంద్రత విపరీతంగా పెరిగింది. 2024 గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో ప్రతి ఎంపీకి 19.30 లక్షల మంది, తెలంగాణలో 19.50 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 16.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఈ అధిక ఓటరు సాంద్రతను దృష్టిలో ఉంచుకుని పునర్విభజన చేపడితే, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 స్థానాలు 26 వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు.
కాంగ్రెస్ చరిత్ర అంతా ద్వంద్వ వైఖరే
రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన చారిత్రక ద్వంద్వ వైఖరిని ఆయన పత్రాల ద్వారా బట్టబయలు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారు 1961 జూన్ 27న ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో, “నేను ఏ రకమైన రిజర్వేషన్లనైనా వ్యతిరేకిస్తాను… అవి అసమర్థతకు దారితీస్తాయి” అని పేర్కొన్నారని వెల్లడించారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1980లో మండల్ కమిషన్ నివేదిక సమర్పించినప్పటికీ దానిని అమలు చేయలేదని ఆరోపించారు. రాజీవ్ గాంధీ గారు 1990 సెప్టెంబర్ 6న లోక్సభలో మాట్లాడుతూ, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తే దేశంలో కుల యుద్ధాలు వస్తాయని హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించారు. నేడు రాహుల్ గాంధీ గారు “జిత్నీ ఆబాదీ ఉత్నా హక్” అని నినదిస్తున్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజన ప్రక్రియకు అడ్డుపడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
పాతబస్తీలో ‘జెర్రీమాండరింగ్’పై ధ్వజం
హైదరాబాద్ నియోజకవర్గాల విభజనలో వివక్ష ఉందని ఆయన ఆరోపించారు. ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలలో ప్రతి 20-25 వేల మందికి ఒక కార్పొరేటర్ డివిజన్ ఉంటే, హిందూ మెజారిటీ ప్రాంతాలలో 50 వేల మందికి ఒకే డివిజన్ ఉండటం జెర్రీమాండరింగ్ అక్రమాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలను సరిదిద్దడానికి శాస్త్రీయమైన డీలిమిటేషన్ అవసరమని పేర్కొన్నారు. విపక్షాలు క్రెడిట్ అంతా మోదీ గారికి పోతుందన్న భయంతోనే ‘ధర్మ సంకటం’ పేరిట నాటకాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు,రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి వాకదానీ పుల్లారావు యాదవ్, రాష్ట్ర మహిళ నాయకులు దొడ్డా అరుణ అత్తి విజయ రెడ్డి, అనిత ,రజినీ రెడ్డి , స్వర్ణకుమారి, మందా సరస్వతి ,మనీ , ఫణి కుమారి ,నాగమణి తదితరులు పాల్గొన్నారు.

