ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద
పోషకాహార లోప రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
అదనపు కలెక్టర్ విద్యాచందన
ఘనంగా పోషణ పక్వాడ ముగింపు వేడుకలు
కాకతీయ, కొత్తగూడెం: ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి నిజమైన సంపద అని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడిగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ‘పోషణ పక్వాడ – 2026’ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పోషణ పక్వాడ స్ఫూర్తిని కేవలం 15 రోజులకే పరిమితం చేయకుండా ఏడాది పొడవునా కొనసాగించాలని సూచించారు. 2026 నాటికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, విటమిన్లు, ఖనిజాలు అందేలా అవగాహన కల్పించాలని కోరారు.
తల్లి గర్భం నుంచే ఆరోగ్యం..
జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినా మాట్లాడుతూ.. జిల్లాలోని 2061 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార విలువలపై విస్తృత అవగాహన కల్పించామన్నారు. బిడ్డ ఆరోగ్యం తల్లి గర్భం నుంచే మొదలవుతుందని, గర్భిణులు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వల్ల బిడ్డకు జీవితాంతం అవసరమైన రోగనిరోధక శక్తి లభిస్తుందని పేర్కొన్నారు.
వేడుకగా గ్రాడ్యుయేషన్ డే..
కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతాలు జరిపించారు. పోషణ పక్వాడలో ప్రతిభ కనబరిచిన సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు పోషణ అభియాన్ సిబ్బందికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత, వైద్య అధికారులు సతీష్, డాక్టర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

