డాక్టర్ బండి కుమార్కు ‘స్వర్ణనంది’ పురస్కారం
సామాజిక సేవ, వృత్తిలో ప్రతిభకు గుర్తింపు
3న రవీంద్రభారతిలో అవార్డు ప్రదానం
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ప్రతిష్టాత్మక ‘ఆనందో బ్రహ్మ స్వర్ణనంది’ పురస్కారానికి ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా వివిధ టీవీ ఛానళ్లు, పత్రికల్లో జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. సమాజంలోని సమస్యలను వెలికితీయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడంలో విశేష కృషి చేస్తున్నారు. ఈ సేవలను గుర్తించిన కమిటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఒక దినపత్రికలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధిగా విధులు నిర్వహిస్తున్న బండి కుమార్.. సంచలనాత్మక కథనాలకు పెట్టింది పేరు. అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా వార్తాకథనాలు అందించడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. అక్రమార్కుల బెదిరింపులకు వెరవకుండా, వృత్తిలో నైతిక విలువలను పాటిస్తూ పేదల పక్షాన నిలవడం ద్వారా జిల్లాలోని యువ జర్నలిస్టులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారం..
ఈ నెల 3న (ఆదివారం) హైదరాబాద్లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరిగే కార్యక్రమంలో బండి కుమార్ ఈ అవార్డును అందుకోనున్నారు. మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. నంది అవార్డుకు ఎంపికైన బండి కుమార్కు జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, అధికారులు అభినందనలు తెలుపుతున్నారు.

