బంగాల్లో ఎన్నికల రగడ
లెక్కింపునకు ముందే ఉద్రిక్తతలు
ఈవీఎం స్ట్రాంగ్ రూంల భద్రతపై టీఎంసీ ఆందోళన
సీఎం మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో రాత్రిపూట ధర్నా
స్ట్రాంగ్ రూం సమీపంలోకి బీజేపీ జెండాతో ఉన్న కార్ల ప్రవేశంపై దుమారం
నవ్పారాలో బీజేపీ నేత కుందన్ సింగ్ ఇంటిపై సాయుధుల కాల్పులు
లెక్కింపు విధుల్లో ఉన్న అధికారుల వ్యక్తిగత సమాచారం లీక్పై సువేందు అధికారి ఆగ్రహం
బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణ
ఓటమి భయంతోనే టీఎంసీ నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ విమర్శ
కోల్కతా : పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనున్న నేపథ్యంలో తరుణంలో రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపుర్ స్థానంతో పాటు పలు ప్రాంతాల్లో ఈవీఎంల భద్రత, రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈవీఎం స్ట్రాంగ్ రూంల భద్రతపై టీఎంసీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలతో ఫలితాలకు ముందే బంగాల్లో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది.
కోల్కతాలోని భవానీపుర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన సఖావత్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్ వద్ద గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్ట్రాంగ్ రూం పరిసరాల్లోకి బీజేపీ జెండాలున్న రెండు కార్లను అనుమతించారని ఆరోపిస్తూ టీఎంసీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకుని నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం స్ట్రాంగ్ రూంకు 100 మీటర్ల దూరంలో టీఎంసీ కార్యకర్తలు శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఆ కారును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
స్ట్రాంగ్ రూంల వద్ద అక్రమాల ఆరోపణలు
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ స్ట్రాంగ్ రూంల భద్రతపై టీఎంసీ ఫిర్యాదులు చేస్తోంది. హౌరాలో స్ట్రాంగ్ రూం సమీపంలో జరుగుతున్న నిర్మాణ పనులను టీఎంసీ అభ్యంతరంతో నిలిపివేశారు. కోల్కతాలోని ఖుదిరాం అనుశీలన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ కవర్లను అనధికారికంగా వేరు చేస్తున్నారని టీఎంసీ ఫిర్యాదు చేసింది. అసన్సోల్ కాలేజీ, బరసత్ గవర్నమెంట్ కాలేజీల్లోని సీసీటీవీ కెమెరాలను కొన్ని నిమిషాల పాటు స్విచ్చాఫ్ చేశారని టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఓటమి భయంతోనే టీఎంసీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ ప్రతినిధి సజల్ ఘోశ్ మండిపడ్డారు.
బీజేపీ నేత ఇంటిపై కాల్పులు
నార్త్ 24 పరగణాల జిల్లా నవ్పారాలో బీజేపీ కీలక నేత కుందన్ సింగ్ ఇంటిపై శనివారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారని బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఆరోపణలను టీఎంసీ అభ్యర్థి సోమనాథ్ శ్యామ్ ఖండించారు. మరోవైపు, లెక్కింపు విధుల్లో ఉన్న అధికారుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తూ వారిపై ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఇది ఎన్నికల నిబంధనల తీవ్ర ఉల్లంఘన అని, దీనివల్ల లెక్కింపు ప్రక్రియ నిష్పాక్షికత దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.

