రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలు
బహిరంగ మార్కెట్లో వేలం వేయకుండా పేదలకు పంపిణీ
మధ్యవర్తుల దందాకు చెక్ పెడుతూ సర్కార్ కీలక నిర్ణయం
గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులకూ బలవర్ధకమైన ఆహారం
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్నదాతలకు భరోసా కల్పిస్తూనే, పేద ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి సేకరించిన జొన్న, మొక్కజొన్నలను బహిరంగ మార్కెట్లో వేలం వేయకుండా, నేరుగా రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంట పండించిన రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో మొక్కజొన్న, జొన్నలను ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట
సాధారణంగా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేస్తుంది. దీన్ని అదునుగా తీసుకుని దళారులు, మధ్యవర్తులు తక్కువ ధరకే దక్కించుకుని లాభపడుతుంటారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సేకరించిన ధాన్యాన్ని ప్యాకింగ్ చేయించి సివిల్ సప్లై శాఖ ద్వారా నేరుగా ప్రజలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. “ధాన్యం కేవలం మార్కెట్ సరుకుగా మిగిలిపోకూడదు.. అది పేదవాడి ఆకలి తీర్చి, పౌష్టికాహారంగా మారాలి” అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా ఈ పంటల సరఫరాకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పౌల్ట్రీ రైతులకు అవసరమైన మేరకు కూడా జొన్నలు, మొక్కజొన్నలను సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం పట్ల రైతులు, సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సన్నాహక చర్చల కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు మరియు వ్యవసాయ విభాగానికి చెందిన ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

