స్కూలు సామగ్రి టెండర్లలో ‘రేవంత్’ భారీ దోపిడీ!
బ్లాక్ లిస్టు కంపెనీలకే రూ.1200 కోట్ల కాంట్రాక్టులా?
కరీంనగర్లో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి హేయనీయం
నగరంలో మహిళలకు రక్షణ లేదని సుమతి మాటలే సాక్ష్యం
ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే వ్యవస్థీకృత దోపిడీ జరుగుతోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి విద్యాసంస్థలను అవినీతికి అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును, కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. గతంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దక్కే పాఠశాల సామాగ్రి సరఫరా కాంట్రాక్టులను ఇప్పుడు ముఖ్యమంత్రి తన గుప్పిట్లోకి తీసుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకే మేలు చేసేలా టెండర్ నిబంధనల్లో టర్నోవర్ పరిమితిని భారీగా పెంచారు.
బ్లాక్ లిస్ట్ కంపెనీలకు ప్రాధాన్యత
గతంలో తాము బయటపెట్టిన ‘బంకర్ బెడ్’ కుంభకోణంలో దోషులుగా ఉన్న కంపెనీలకే మళ్లీ రూ.1200 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర, గుజరాత్ చెందిన ‘మఫత్ లాల్’ వంటి కంపెనీలకు రేవంత్ రెడ్డి కొమ్ముకాస్తున్నారని, హైకోర్టు ఆదేశాలను, టెస్కో నిబంధనలను బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడిని శ్రవణ్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ అవాకులు చవాకులు పేలుతున్నారని, పోలీసులు, బీజేపీ కలిసి దాడులు చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఏజెంట్లా మారి బీఆర్ఎస్పై దాడులకు తెగబడుతున్నారని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. “భారత్ మాతా కీ జై” అనే నినాదం ఇచ్చే వారు వాడే భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.
మహిళల రక్షణ ఏదీ?
హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని పోలీసు అధికారిణి సుమతి వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని శ్రవణ్ పేర్కొన్నారు. “ఒక బాధ్యతాయుతమైన అధికారిణి హైదరాబాద్లో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారంటే శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థమవుతోంది” అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ను సెటిల్మెంట్లకు వాడుకోవడం మానుకుని, పోలీసులను వారి విధి నిర్వహణ సక్రమంగా చేసుకోనివ్వాలని సూచించారు. త్వరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేత నిఖిల్ కూడా పాల్గొన్నారు.

