పదేళ్లలో ‘గ్లోబల్ సిటీ’గా హైదరాబాద్
భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మౌలిక వసతులు
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
తెలంగాణ రైజింగ్ విజన్-2047తో ముందుకు
లక్ష మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తాం
ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీల ఏర్పాటు
‘నాస్కామ్’ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్ను ‘గ్లోబల్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహానగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.
తెలంగాణ రైజింగ్ విజన్-2047
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని మంత్రి వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో జరగనివ్వబోమన్నారు. అందుకే భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి కీలక ప్రాజెక్టులను చేపట్టామన్నారు.
లక్ష మందికి కొత్తగా ఉపాధి
టెక్ కంపెనీలే కాకుండా బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగ సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్ను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. గతేడాది నగరంలో రికార్డు స్థాయిలో 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా మరో 100 జీసీసీలను ప్రారంభించి, వాటి ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా, ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా సమగ్ర రోడ్డు మ్యాప్ను సిద్ధం చేస్తున్నామన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.

