మణుగూరులో గుప్త నిధుల వేటగాళ్లు
తవ్వకాలు సాగించేందుకు క్షుద్ర పూజలు!
ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి మంత్రగాళ్ల రాక
నిధి కోసం మూగజీవాల బలి.. నరబలికి కూడా వెనకాడని ముఠా?
అమాయకులను నమ్మించి లక్షల రూపాయల దోపిడీ
వేటగాళ్ల వెనుక కొందరు విలేకరులు, ఓ అధికారి హస్తం?
జేసీబీలతో అడవులను జల్లెడ పడుతున్న వైనం
అంధ విశ్వాసాలతో పల్లెల్లో భయానక వాతావరణం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో గుప్తనిధుల వేటగాళ్లు పడగ విప్పుతున్నారు. రాత్రి వేళల్లో మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ, ఎక్కడో నిధులున్నాయన్న భ్రమలో అడవులను, పాత ఇళ్ల పరిసరాలను జల్లెడ పడుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి, నిఘా లేని సమయం చూసి జేసీబీ వంటి భారీ యంత్రాలతో సైతం తవ్వకాలు జరుపుతుండటం స్థానికంగా భయాందోళనలకు దారితీస్తోంది. ఒక ముఠాగా ఏర్పడి, నిధుల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వీరు సిద్ధమవుతుండటం గమనార్హం. మరీ ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మంత్రగాళ్లను రప్పించి మరీ ‘రెక్కీ’ నిర్వహిస్తుండటం ఈ ముఠా పక్కా వ్యూహరచనకు నిదర్శనంగా మారుతోంది. కేవలం అడవులకే పరిమితం కాకుండా, పవిత్రమైన ఆలయాలను సైతం వీరు వదలడం లేదు. గతంలో మల్లంపాడు చెరువు పక్కన ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయ గర్భగుడిలో దుండగులు జరిపిన తవ్వకాలు చూసి భక్తులు విస్తుపోయారు. విగ్రహానికి రక్తాభిషేకం చేసి, అక్కడే కోడిని బలి ఇచ్చి ఆరడుగుల గొయ్యి తవ్వడం చూస్తే ఈ ముఠాల క్రూరత్వం మరియు అంధవిశ్వాసాల తీవ్రత అర్థమవుతోంది.

ఊరూరా గొయ్యిలు.. క్షుద్ర పూజల కలకలం
మణుగూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం తవ్వకాలతో నిండిపోతున్నాయి. రాజుపేట మారులంపాడు చెరువు సమీపంలో ఎక్కడ చూసినా 10 అడుగుల లోతు గొయ్యిలు దర్శనమిస్తున్నాయి. హనుమాన్ టెంపుల్ రథం గుట్ట, మల్లెపల్లి గోదావరి తీరం, రైల్వే స్టేషన్ మార్గంలోని దర్గా ప్రాంతం, పీవీ కాలనీ క్వార్టర్ల వద్ద కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయి. ఖమ్మంతోగు, బుగ్గ ప్రాంతాలతో పాటు అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద కూడా నిధుల వేట కొనసాగుతూనే ఉంది. ఈ ముఠా కేవలం తవ్వకాలకే పరిమితం కాకుండా, అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకుంటోంది. “మీ భూమిలో బంగారం ఉంది.. అది తీయడానికి శక్తివంతమైన మంత్రగాళ్లు కావాలి” అని నమ్మించి పూజల పేరుతో లక్షల రూపాయలు గుంజుతున్నారు. మరికొన్ని చోట్ల ఇనుప రాడ్లకు బంగారు రంగు పూసి, అదే నిధి అని నమ్మించి టోకరా వేస్తున్నారు. తీరా అప్పులు చేసి డబ్బులు కట్టిన తర్వాత.. “గ్రహణం బాగాలేదు.. శక్తులు అడ్డుపడుతున్నాయి” అని మంత్రగాళ్లు తప్పించుకుంటున్నారు. మోసపోయామని తెలిసినా, బయటకు చెబితే తమ పరువు పోతుందని బాధితులు లోలోన మదనపడుతుండటం గమనార్హం.
‘పెద్దల’ అండదండలు.. పోలీసుల నిఘా ఏది?
ఈ చీకటి దందా ఇంత బహిరంగంగా సాగడం వెనుక కొందరు పత్రికా విలేకరుల ప్రమేయం ఉండటం విచారకరం. “మేము చూసుకుంటాం.. ఎవరూ రారు” అంటూ వీరు వేటగాళ్లకు భరోసా ఇస్తూ వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరితో పాటు స్థానికంగా ఉన్న ఒక శాఖకు చెందిన అధికారి కూడా ఈ ముఠాకు ఆశీస్సులు అందిస్తున్నట్లు సమాచారం. తవ్వకాల్లో నిధి దొరికితే ‘సగం-సగం’ పంచుకోవాలనే ఒప్పందాలతో ఈ దందా సాగుతున్నట్లు వినికిడి. మంత్రగాళ్ల రాకతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంటున్న తరుణంలో, పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక నిఘా పెంచాలని, అంధవిశ్వాసాలను ప్రోత్సహిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలపై ఉక్కుపాదం మోపాలని మణుగూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోతే, ఈ అంధవిశ్వాసాల వేటలో మరిన్ని అపశ్రుతులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

