ఎక్సైజ్ శాఖ ఎక్కడ?
భద్రాద్రి జిల్లాలో విచ్చలవిడిగా మద్యం సిండికేట్
పేదోడి కడుపు కొడుతున్న బెల్టు షాపులు
ఎంఆర్పీ కంటే రూ.40 అదనం
బడి, గుడి అనే తేడా లేదు.. తెల్లవారుజాము నుంచే అమ్మకాలు
మామూళ్ల మత్తులో అధికారులు.. అప్పుల ఊబిలో పేద కుటుంబాలు
కాకతీయ, మణుగూరు(భద్రాచలం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నాయి. భద్రాచలం, చర్ల, బూర్గంపాడు, సారపాక, లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో బెల్టు షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి. మద్యం నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో నిర్వాహకులు బరితెగిస్తున్నారు. “మమ్మల్ని ఆపేది ఎవరు?” అంటూ ఏకంగా అధికారులకే సవాళ్లు విసురుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రోజంతా కాయకష్టం చేసి జీవనం సాగించే పేదవాడి సంపాదనను ఈ సిండికేట్ నిర్వాహకులు నిలువునా దోచుకుంటున్నారు.
సమయపాలన లేదు.. నిబంధనలు లేవు
గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే కిరాణా షాపులు, హోటళ్లు బెల్టు షాపులుగా మారిపోయాయి. బడి, గుడి అనే విచక్షణ లేకుండా జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో సైతం తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు మొదలవుతున్నాయి. మద్యం బాటిల్పై ఎంఆర్పీ కంటే రూ. 20 నుంచి రూ. 40 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యులను పీడిస్తున్నారు. ప్రధాన రహదారుల పక్కన మద్యం విక్రయించకూడదనే నిబంధన ఉన్నా.. దర్జాగా రోడ్ల పక్కనే దుకాణాలు నడుస్తున్నాయి. ఈ విచ్చలవిడి అమ్మకాల వల్ల గ్రామాల్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఛిన్నాభిన్నమవుతున్న నిరుపేద కుటుంబాలు
మద్యం మహమ్మారి కారణంగా ఏజెన్సీలోని నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చేసిన కూలీ డబ్బులన్నీ తాగుడికే ఖర్చు చేస్తుండటంతో పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు మద్యానికి బానిసైన వ్యక్తులు అనారోగ్యం పాలవుతుంటే, మరోవైపు గృహహింస పెరిగిపోతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిరసనలు
బెల్టు షాపులను అరికట్టలేనప్పుడు ఎక్సైజ్ శాఖకు జీతాలు ఎందుకని పలు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సామాన్య ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ.. సిండికేట్లకు కొమ్ముకాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి, బెల్టు షాపులను శాశ్వతంగా నిషేధించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

