ఆగని ‘మద్యం’ సిండికేట్ దందా
ప్రభుత్వం ధర ఒకటి.. సిండికేట్ బాదుడు మరొకటి
భద్రాచలం ఏజెన్సీలో విచ్చిల విడిగా బెల్ట్ షాపులు
మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోని ఎక్సైజ్ శాఖ
అధిక ధరలకు మద్యం విక్రయాలకు ప్రొత్సాహం
సామాన్యుల జేబులకు చిల్లులు.. వ్యాపారులకు కోట్ల ఆదాయం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాల డిమాండ్
కాకతీయ, మణుగూరు (భద్రాచలం) : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం సిండికేట్లే శాసనకర్తలుగా మారారు. మణుగూరు, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ వంటి మండలాల్లో మద్యం వ్యాపారులు సిండికేటయ్యారు. ఒక ముఠాగా ఏర్పడి మద్యం ప్రియులను నిలువునా దోచుకుంటున్నాయి. ప్రతి సీసాపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అక్రమ సంపాదనతో వ్యాపారులు జేబులు నింపుకుంటున్నా, అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం ‘మాకేమీ పట్టనట్లు’ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ధర ఒకటి.. సిండికేట్ రేటు మరొకటి!
మద్యం దుకాణాల వద్ద ధరల పట్టికలు ప్రదర్శించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. బెల్టు షాపుల దందా ఏజెన్సీ గ్రామాల్లో కుగ్రామాల వరకు విస్తరించింది. ప్రతి క్వార్టర్ సీసాపై రూ. 10 నుంచి రూ. 20 వరకు, బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన దుకాణాల కంటే బెల్టు షాపుల్లోనే విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. సిండికేట్ వ్యాపారులు గోదాముల నుంచి నేరుగా బెల్టు షాపులకు మద్యం తరలిస్తూ అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల సామాన్య కూలీలు, మద్యానికి బానిసైన వారు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
కోట్లు దోపిడీ జరుగుతున్నా మౌనం ఎందుకు?
సిండికేట్ల దోపిడీపై మీడియాలో కథనాలు వస్తున్నా, స్థానికులు మొరపెట్టుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం కళ్లు మూసుకుని కూర్చున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ అక్రమ విక్రయాలు ఎవరి ప్రయోజనాల కోసం సాగుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలు లేనిదే ఇంత పెద్ద ఎత్తున సిండికేట్ దందా సాధ్యం కాదని, మామూళ్ల మత్తులో పడి అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో మద్యం దందా అదుపు తప్పిందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించేలా చూడాలని, బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఏజెన్సీ ప్రాంతంలో సామాన్యుల బతుకులు మరింత దుర్భరంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

