సుమలత హత్య కేసులో కత్తి కాశిబుగ్గదే!
ఏనాడో హెచ్చరించిన కాకతీయ దినపత్రిక
మారణాయుధాలను తలపించేలా కత్తుల వ్యాపారం
కాశిబుగ్గ నడిరోడ్డుపైనే కత్తుల తయారీ కేంద్రాలు
వివేకానంద కాలేజీ ఆనుకుని ఎగ్జిబిషన్ దుకాణాలు
ఈ ఏరియా ఇప్పటికే రౌడీషీటర్లకు అడ్డాగా మారిన వైనం
అయినా ఈ వ్యాపారంపై దృష్టిసారించని పోలీసులు
బహిరంగంగా కత్తులు కనిపిస్తున్నా కట్టడి చేయడంలో విఫలం
ఓ మహిళను హత్య చేయడంలో కత్తి ఇక్కడే కొన్న దుర్మార్గుడు
భవిష్యత్ లో హత్యాయుధాలకు కాశిబుగ్గ నెలవుగా మారే ప్రమాదం
కాకతీయ, వరంగల్ : సినిమాల్లో కనిపించే పొడవాటి, పెద్దపెద్ద వంకలు తిరిగిన కత్తులు వరంగల్ మహానగరంలోని కాశిబుగ్గ నడిరోడ్డుపై బహిరంగంగానే విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే వివేకానంద కాలేజీని ఆనుకుని ఉన్న ఎగ్జిబిషన్ దుకాణాల్లో మారణాయుధాలను తలపించేలా సాగుతున్న ఈ కత్తుల వ్యాపారం ఇప్పుడు ఒకరి ప్రాణం తీసేందుకు కారణమైంది.
కాశిబుగ్గ నడిబొడ్డున సాగుతున్న ఈ కత్తుల తయారీ, విక్రయాల వల్ల శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని, ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ‘కాకతీయ’ దినపత్రిక నాలుగు నెలల క్రితమే ప్రత్యేక కథనంతో పోలీసులను హెచ్చరించింది. పత్రికా కథనాలను పోలీసులు లైట్ తీసుకున్నారో ఏమో కానీ.. అనుకున్నట్టే ఒక దుర్మార్గుడి చేతిలో ఇక్కడి కత్తి ఓ మహిళ పాలిట యమపాశంగా మారింది. ఈ నెల 20న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో తాళ్లపెల్లి సుమలత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు ఆమెను విచక్షణారహితంగా నరికి చంపడానికి ఉపయోగించిన ఆ పెద్ద కత్తిని కాశిబుగ్గలోనే కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడి కత్తి ఒకరి దారుణ హత్యకు కారణం కావడం పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.

రౌడీషీటర్ల అడ్డాలో కత్తుల దుకాణాలా?
పోలీసు రికార్డుల ప్రకారమే కాశిబుగ్గ ఏరియా ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఎంతో మందిపై రౌడీషీట్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే స్థానిక రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఇంతటి హిస్టరీ ఉన్న ప్రాంతంలో, దుకాణాలకు ఎదురుగానే పోలీసులు నిత్యం వాహన తనిఖీలు చేస్తున్నా.. మారణాయుధాల్లాంటి కత్తులు బహిరంగంగా అమ్ముతున్నా పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఒకప్పుడు కూరగాయలు కోసే చిన్న చాకులు, కత్తిపీటలు చేసిన ఈ కేంద్రాల్లో.. ఇప్పుడు సినిమాల తరహా కత్తులు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులు కూడా అంత పెద్ద కత్తులను వాడరు.. మరి వీటిని ఎవరి కోసం తయారు చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కత్తులు కొనేవారి వివరాలు గానీ, రికార్డులు గానీ ఉండటం లేదు.

ఇప్పటికైనా కట్టడి చేయాలి
సుమలత హత్యోదంతంతోనైనా పోలీసులు కళ్లు తెరవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో కత్తుల వ్యాపారం బహిరంగంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. ఒకవేళ వ్యవసాయ అవసరాల కోసం విక్రయించాల్సి వస్తే.. కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డులు (ఆధార్ జీరాక్స్) వంటి ప్రతులు, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా సేకరించేలా నిబంధనలు తీసుకురావాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఘోరమైన నేరాలకు కాశిబుగ్గ కేంద్రంగా మారే ప్రమాదం ఉందని వరంగల్ నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

