ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
2021 పేస్కేల్ సర్క్యూలర్ను తక్షణమే సవరించాలి
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు రవీందర్ రెడ్డి
కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ కార్మికులను కాలయాపన చేయకుండా వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం నగరంలోని స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గుండు మాధవరావు అధ్యక్షతన ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామ్రేడ్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి హాజరై ప్రసంగించారు.
పాత పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలి
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వారికి పాత పెన్షన్ సౌకర్యం , పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మికులకు అందుతున్న మెడికల్ సౌకర్యాలను యథావిధిగా కొనసాగించాలని, సంస్థలోని అన్ని సెక్షన్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై ప్రస్తుతం పెంచిన అదనపు పనిభారాన్ని తగ్గించాలని, 2021 పే స్కేల్కు సంబంధించిన సర్కులర్ను తక్షణమే సవరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాలు రాంబాబు మాట్లాడారు.
సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్ కార్యాచరణ
సమావేశంలో రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా.. రీజియన్ పరిధిలోని అన్ని డిపోల ప్రతినిధులు దీనిపై చర్చించారు. గతంలో రీజియన్ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) కు వినతిపత్రం అందజేశామని, ఆ సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని నేతలు స్పష్టం చేశారు. లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 9వ తేదీన ఖమ్మంలో రీజియన్ జనరల్ బాడీ సమావేశాన్ని, జూన్ 16వ తేదీన ప్రత్యేక మహిళా సదస్సును నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డిపో నుండి గుగ్గిళ్ళ రోశయ్య, సరిత, వెంకటయ్య, మధిర డిపో నుండి వెంకన్న, మణుగూరు డిపో నుండి వై.ఎన్. రావు, శేఖర్, లింగయ్య, భద్రాచలం నుండి కె. ప్రతాప్, బాలకృష్ణ, డి.ఎన్. రావు, కొత్తగూడెం డిపో నుండి ఈ. సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

