సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు!
కష్టాల్లోనూ హామీలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ
నేటి నుంచే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి
రూ.5.20 కోట్లతో కొండాపురం–పొన్నెకల్లు రోడ్డు పనులకు శంకుస్థాపన
కాకతీయ ఖమ్మం రూరల్ : ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా చేసుకుని ముందుకు సాగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంలో రూ.5.20 కోట్ల వ్యయంతో పొన్నెకల్లు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ లతో కలిసి ఆయన ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందని, కొండాపురం–పొన్నెకల్లు రోడ్డు పూర్తయితే ఈ ప్రాంత రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

రైతును రాజు చేయడమే లక్ష్యం
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల మేర (రెండు లక్షల రూపాయల వరకు) రైతు రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి బాధ్యత ముగించుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని చెప్పారు. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ.500 బోనస్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. మరోవైపు పేదలకు పక్కా గృహాలు అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత మంజూరు ప్రక్రియ జూన్ 1 (సోమవారం) నుంచే ప్రారంభం కానుందని మంత్రి వెల్లడించారు. ఈ విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు, ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే మంజూరైన 4.50 లక్షల ఇళ్లకు సంబంధించి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు.
రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలు
ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండేళ్లలోనే 72 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేద కుటుంబాలకు 200 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

