ప్రజాదరణను జీర్ణించుకోలేకే ఆది శ్రీనివాస్పై ఆరోపణలు
రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి
కాకతీయ, రుద్రంగి: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అవి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి విమర్శించారు. సోమవారం రుద్రంగిలో ఆయన మాట్లాడుతూ, ప్రజల విశ్వాసం పొందిన నాయకుడిపై ఆధారాల్లేకుండా విమర్శలు చేయడం తగదని అన్నారు. ఆది శ్రీనివాస్ సొంత కృషితో ప్రజా నాయకుడిగా ఎదిగారని, బీసీ వర్గాల ఆశాజ్యోతిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ధాన్యం అక్రమ రవాణా కేసుతో ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం ఒక వ్యక్తి కుటుంబ సభ్యుడు కాంగ్రెస్ కార్యకర్త అయినంత మాత్రాన ప్రభుత్వ విప్ను కేసులో ఇరికించడం సమంజసం కాదన్నారు. తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసుకుంటుందని చెప్పారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మబోరని, ఇటువంటి ఆరోపణలు ఆయనపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచుతాయని తిరుపతి పేర్కొన్నారు.

