మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
డ్రగ్స్ను అరికట్టడంలో యువతదే కీలక పాత్ర
ఎస్సై ఎస్సై సిరిసిల్ల అశోక్
ఆదర్శ పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ
కాకతీయ, ఇల్లంతకుంట : సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట్ గ్రామంలోని టీజీఎంఎస్ ఆదర్శ పాఠశాలలో ఆదివారం డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల వినియోగం యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు, యువకులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ మాఫియా తమ కార్యకలాపాలను విస్తరిస్తోందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఒకసారి డ్రగ్స్కు బానిసైన వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్సై అశోక్ వివరించారు. విద్యార్థి దశ జీవితానికి పునాది వంటిదని, ఈ సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. తమ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం కలిగితే వెంటనే 1908 హెల్ప్లైన్కు లేదా ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రహీంఖాన్పేట్ గ్రామ సర్పంచ్ కమటం లావణ్య, పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

