కాంగ్రెస్లో ఆధిపత్య పోరు
బీఆర్ఎస్ వ్యూహాత్మక దూకుడు!
చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల్లో కాంగ్రెస్ వర్గపోరు
నేతల విభేదాలతో పార్టీ కార్యకలాపాల్లో డైలామా
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం
సర్పంచ్ ఫోరం ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా
కలిసికట్టుగా పనిచేస్తేనే గట్టెక్కేది.. కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన
కాకతీయ, చేర్యాల : జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అధికార పార్టీలో ఉన్న ఈ ఆధిపత్య పోరు, పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతల మధ్య నెలకొన్న విభేదాలు, కార్యకర్తల మధ్య దూరాన్ని పెంచుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గంగా నాయకత్వం విడిపోవడం పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారింది. ఒక వర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరో వర్గం దూరంగా ఉండటం, పరోక్ష విమర్శలు చేసుకోవడం వల్ల సామాన్య కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఈ విభేదాలు కొనసాగితే, పార్టీ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని, నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.


చురుగ్గా గులాబీ పార్టీ.. రాజకీయ వేడి!
మరోవైపు, జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్రజా సమస్యల అజెండాతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. రైతుల కష్టాలు, తాగునీటి ఎద్దడి, అభివృద్ధి పనుల జాప్యం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తూ, ప్రజల్లోకి వెళ్తోంది. గతంలో జరిగిన సర్పంచ్ ఫోరం ఎన్నికల్లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ బలాన్ని నిరూపించుకుంది. అధికారంలో లేకపోయినా గ్రామస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్ను వాడుకుంటూ, అధికార పార్టీకి గట్టి రాజకీయ సవాల్ విసురుతోంది.
మారాలి.. లేదంటే ఇబ్బందే!
“ప్రజల కోసం పోరాడాల్సిన సమయంలో, వర్గపోరుతో సమయం వృధా చేసుకోవడం ఎంతవరకు సమంజసం?” అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా మారుతుండగా, అధికార కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో కాలక్షేపం చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధిపత్య పోరుకు ముగింపు పలికి, నేతలందరూ సమన్వయంతో ప్రజల్లోకి వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజల్లో బలంగా నిలబడగలదు. పార్టీ అధిష్టానం ఈ వర్గ విభేదాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, నాయకులను ఏ విధంగా దారిలోకి తెస్తుందో వేచి చూడాలి.

