ఇసుక దోపిడీ నిజం కాదా..?!
గిరిజనుల పొట్ట కొడుతోంది మీరు కాదా..?
నడీ గోదావరిలో ఇసుక లోడింగ్ నిజం కాదా
రాత్రి వేళల్లో ర్యాంపుల్లోకి వాహనాలు వెళ్లేది నిజం కాదా..?
దశాబ్దన్నర కాలంగా ర్యాంపుల చేజిక్కించుకుంటున్నది నిజం కాదా?
గిరిజనులను ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేస్తోంది నిజం కాదా?
కాకతీయపై కేసులు పెట్టాలని చూసింది నిజం కాదా..?
సాక్ష్యాలతో రాసినా అసత్య ప్రచారానికి ప్రయత్నం చేసింది నిజం కాదా..?
కాకతీయపై గిరిజనులను ఉసిగొల్పేందుకు ఇసుక కాంట్రాక్టర్ శ్రీకర్ విఫలయత్నం
మణుగూరు ప్రెస్మీట్తో ఎట్టకేలకు వెలుగులోకి.. బట్ట బయలైన అక్రమాల బాగోతం
కాకతీయ,తెలంగాణ బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇసుక ర్యాంపుల కాంట్రాక్టర్ శ్రీకర్ పరిస్థితి ఇప్పుడు “గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు”గా ఉంది. ఇసుక దందాలో తన పాత్రపై ఉత్తరం కాకతీయలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో, తనను తాను కాపాడుకునేందుకు గురువారం ఆయన నిర్వహించిన ప్రెస్మీట్ ఇప్పుడు మణుగూరులో ప్రభుత్వ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇసుక ర్యాంపులకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన శ్రీకర్, ప్రెస్మీట్లో మాత్రం జీరో లారీలు, ఓవర్లోడ్, అక్రమాలపై లెక్చర్లు దంచడం ఆయన పాత్రను బట్టబయలు చేస్తోందని స్పష్టమైంది.

శ్రీకర్ సమాధానం చెప్పాలి
నిజాయితీగా వ్యాపారం చేస్తున్నానని చెప్పుకుంటున్న శ్రీకర్, మరి కాకతీయ పత్రిక సంధిస్తున్న సూటి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? గిరిజన సొసైటీల పేరుతో దందా నడుపుతూ, వెనుక ఉండి చక్రం తిప్పుతున్నది శ్రీకర్ కాదా? గత దశాబ్దన్నర కాలంగా గిరిజన సంఘాలను ప్రలోభాలకు గురిచేస్తూ వారి చేతుల్లోంచి ర్యాంపులను లాగేసుకుని ఇసుక మాఫియాను ఏలుతున్నది ఆయనే కదా! “తామర తంపరగా” పెరిగిన శ్రీకర్ ఆస్తులే ఆయన అక్రమ దందాను బట్టబయలు చేస్తున్నాయి. గిరిజనుల ఉపాధికి భరోసా ఇవ్వాల్సిన శ్రీకర్, వారిని ఒక అడ్డుగోడలా వాడుకుంటూ వారి పేరుతో సొంత లాభం పొందుతుండటం వాస్తవం కాదా? తన అక్రమాల వల్ల గిరిజనులు నష్టపోతున్నారని తెలిసి కూడా, వారిని ఉసిగొల్పి పత్రికలపైకి పంపడం శ్రీకర్ అసమర్థతకు, భయానికి సంకేతం కాదా? నిబంధనల ప్రకారం స్టాక్ యార్డుల నుంచి లోడింగ్ జరగాలి, కానీ శ్రీకర్ మాత్రం నడి గోదావరిలో భారీ యంత్రాలతో లోడింగ్ చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నది వాస్తవం కాదా? రాత్రి వేళల్లో క్వారీల్లోకి వాహనాలను అనుమతించి, ఎవరికి తెలియకుండా ఈ అక్రమ రవాణా కొనసాగిస్తున్నది నిజం కాదా? సాక్ష్యాలతో సహా కథనాలు రాస్తుంటే, సమాధానం చెప్పడం మానేసి కాకతీయపై రకరకాలుగా అసత్య ప్రచారాలకు పాల్పడే ప్రయత్నం చేసింది నిజం కాదా.. కేసులు పెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా శ్రీకర్ దేనిని దాచాలని చూస్తున్నారు? “దొంగే దొంగ అన్నట్లు” సాగుతున్న ఈ ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.

గతాన్ని పరోక్షంగా ఒప్పుకున్న శ్రీకర్
“గతంలో అక్రమాలు జరిగాయి.. ఈసారి జరగడం లేదు” అని ప్రెస్మీట్లో శ్రీకర్ చేసిన వ్యాఖ్యలు ఆయన నేరాన్ని పరోక్షంగా అంగీకరించినట్లుగా లేవా? గతం, వర్తమానం.. ఇలా రెండు సందర్భాల్లోనూ ర్యాంపులను తన కనుసన్నల్లో ఉంచుకున్నది శ్రీకర్ కాదా? “అడవిలో ఏనుగును చంపి.. ఊళ్లో గాలికి ఎండినట్లు” శ్రీకర్ చేస్తున్న దందా గురించి అందరికీ తెలుసు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్ ప్రాంతాల్లో పోలీసులు నిత్యం జీరో లారీలను పట్టుకుని కేసులు నమోదు చేయడం అక్రమాలు జరగడం లేదనడానికి నిదర్శనమా? శ్రీకర్ చెబుతున్న మాటలకు ర్యాంపుల్లో జరుగుతున్న అరాచకాలకు పొంతన ఎందుకు లేదు? లారీ యజమానుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతుంది నిజం కాదా.. లారీ యజమానులు, డ్రైవర్లు టీజీఎండీసీ ఎదుట ధర్నా చేసింది నిజం కాదా..? రాజకీయ వర్గాలను సైతం తప్పుదోవ పట్టించడం నిజం కాదా..? అధికార పార్టీ ఒకరిద్దరు పెద్ద నేతలు మీ వెనుక ఉన్నారనే బరితెగింపు వైఖరితో అక్రమాలతో చెలరేగిపోతున్నది నిజం కాదా.. ఇసుక అక్రమ వ్యవహారాలతో ఐఏఎస్లు సైతం తలలు పట్టుకుంటుండం నిజం కాదా..నీ మాట విననందుకు ఐపీఎస్ను ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా.. ఇలా చెప్పుకుంటూపోతే.. చాలా ఉంటాయి..మీ గురించి. ఉత్తరం కాకతీయలో ప్రచురించిన ప్రతి కథనానికి కట్టుబడి ఉన్నామని, ఆధారాలు, సాక్ష్యాలను చూపిస్తూనే ఈ దందాపై ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేస్తోంది. నిజాయితీపరులే అయితే, ఏసీబీ, విజిలెన్స్, మైనింగ్ మరియు ఎన్జీటీ అధికారులతో సమగ్ర విచారణకు శ్రీకర్ ఎందుకు ముందుకు రావడం లేదు? “కడిగిన ముత్యంలా” బయటపడవచ్చు కదా! ఎందుకు విచారణ అంటే శ్రీకర్ అంతగా జంకుతున్నారు? ఆయన వద్ద అన్నీ లెక్కలు ఉంటే బయటపెట్టాలి, అంతేకానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా?
దోపిడీని ఆపేదెవరు?
గిరిజన సొసైటీల నిర్వహణలో ఉండాల్సిన క్వారీలను శ్రీకర్ బినామీల పేర్లతో నడపడం నిజం కాదా? ఆ సొసైటీలకు రావలసిన ఆదాయాన్ని, గిరిజనులకు దక్కాల్సిన కూలీని దొంగిలిస్తూ, కోట్లలో ఆస్తులు గడించడం ఏ సంస్కారం? దశాబ్దన్నర కాలంగా గిరిజనుల పొట్టకొడుతూ, తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తీరును చూసి, ఆ గిరిజన ప్రజలు ఇప్పుడు శ్రీకర్కు వ్యతిరేకంగా గళం ఎత్తుతుంటే భయం పట్టుకోలేదా? ఇప్పటికైనా సరే, ఆ బినామీల ముసుగు తొలగించి, అసలు ఆస్తుల విలువ ఎంత? అనే దానిపై సమాధానం చెప్పే ధైర్యం శ్రీకర్కు ఉందా? “నోరున్న వాడు లెంపలు కొట్టుకుంటాడు” అన్నట్లు, శ్రీకర్ బాగోతం ఆయనే బయటపెట్టుకుంటున్నారు. శ్రీకర్, మీరు గిరిజనుల పేరుతో ఆడుతున్న ఈ ‘ఇసుక’ నాటకం ఎన్నాళ్లు సాగుతుందో అనుకుంటున్నారు? ఈ నాటకంలో శ్రీకర్ వేస్తున్న వేషాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇప్పటికైనా సరే, ఈ అక్రమ దందాను ఆపి, గిరిజనులకు దక్కాల్సిన ఉపాధిని వారికి దక్కనివ్వండి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, మీరు చేస్తున్న అక్రమాలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించండి. కాకతీయ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము శ్రీకర్కు ఉందా? “నిప్పును నీడతో కప్పలేం” కదా! ప్రజలు శ్రీకర్ సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్ష్యాలు చూపిస్తూ అడుగుతున్న ప్రశ్నలకు శ్రీకర్ సమాధానం చెప్పాల్సిందే!

