రాహుల్ మృతిపై వీడని సందిగ్ధత!
కోరుట్లలో మిన్నంటిన ప్రజా ఆగ్రహం
నెల రోజులైనా పురోగతి లేదని ధర్నా
డీఎన్ఏ నివేదిక పేరిట కాలయాపన వద్దు
మృతదేహాన్ని అప్పగించాలని డిమాండ్
న్యాయం చేయాలని కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో
కాకతీయ జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద మృతి ఘటనపై నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో స్థానికుల్లో ప్రజా ఆగ్రహం మిన్నంటింది. హైదరాబాద్లో చదువుకుంటూ అకస్మాత్తుగా అదృశ్యమైన రాహుల్.. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలో గల ఒక బావిలో కుళ్లిన శవమై తేలడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసులో విచారణ నత్తనడకన సాగుతోందని ఆరోపిస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ మరియు కోరుట్ల పద్మశాలి సంఘాల నాయకులు, గ్రామస్తులు కోరుట్ల పట్టణంలో గురువారం భారీ ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, రాహుల్ మృతిపై ఏపీ మరియు తెలంగాణ పోలీసులు సంయుక్తంగా సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

డీఎన్ఏ పరీక్షల పేరుతో తీవ్ర కాలయాపన
ప్రకాశం జిల్లాలో లభ్యమైన మృతదేహం రాహుల్దేనని బట్టలు, ఇతర ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నప్పటికీ, చట్టపరమైన నిబంధనల మేరకు డీఎన్ఏ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే శవాన్ని అప్పగిస్తామని పోలీసులు కాలయాపన చేస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. నెల రోజులుగా తమ కుమారుడి మృతదేహం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ, కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు పుత్రశోకంతో కొట్టుమిట్టాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్నవారికి ఒక న్యాయం, నిరుపేదలకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తూ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై కుల సంఘాల నేతలు తీవ్ర ధ్వజమెత్తారు.
రాహుల్ది ఆత్మహత్య కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్యే!
ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడనే చిన్న కారణంతో కొందరు తోటి స్నేహితులు గతంలో రాహుల్ను తీవ్రంగా బెదిరించారని రాహుల్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ ఆరోపించారు. ఇది ఎంతమాత్రం ఆత్మహత్య కాదని, తమ కుమారుడిని సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి ప్రణాళికాబద్ధంగా హత్య చేసి బావిలో పడేశారని వారు ఖచ్చితంగా చెబుతున్నారు. రాహుల్ మొబైల్ ఫోన్కు సంబంధించిన వాట్సప్ చాటింగ్లు, కాల్ డేటా సహా మిగతా సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే డీఎన్ఏ నివేదికను అత్యవసరంగా తెప్పించి, రాహుల్ భౌతికకాయాన్ని గౌరవప్రదంగా కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులు ఎంతటి వారైనా వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని నాయకులు స్పష్టం చేశారు. పుత్రశోకంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాహుల్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఆర్థికంగా, నైతికంగా పూర్తి అండగా నిలవాలని, బాధిత కుటుంబానికి న్యాయం అందే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఆందోళనలను రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఈ భారీ రాస్తారోకో కారణంగా కోరుట్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, నిరసనకారులకు నచ్చజెప్పి శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అయిలాపూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

