అక్రమాలకు ప్లానింగ్
ఖమ్మం టౌన్ ప్లానింగ్లో.. అడ్డగోలు దందా!
అనుమతుల్లో అధికారుల ద్వంద్వ వైఖరి
ఏసీపీ స్థాయి నుంచి టీపీబీఓ వరకు.. అంతులేని నిర్లక్ష్యం
నిబంధనలు గాలికొదిలి.. నచ్చిన వారికి భారీ భవనాలకు అనుమతులు
సాకులతో దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్న వైనం
‘సుడా’లో తండ్రి.. ‘నగరా’లో కొడుకు.. తెర వెనుక వింత కథ
కమిషనర్ మౌనం.. సామాన్యుడికి శాపం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ప్రజలను అధికారులు ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ, వేధిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుకుని ఏసీపీ స్థాయి అధికారి వరకు అంతా ఒకే ‘తాటి’పై నడుస్తూ, దరఖాస్తుదారుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పనితీరులో ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. ఖానాపురం హవేలీ పరిధిలో రసపాక హోటల్ ఎదురుగా, కేవలం 25 అడుగుల రోడ్డు ఉన్న చోట ఐదు అంతస్తుల భారీ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు, అదే నిబంధనలతో ఉన్న ఇతర దరఖాస్తులను మాత్రం పక్కనబెడుతున్నారు. నిబంధనలను తమకు నచ్చినట్లుగా వాడుకుంటూ, అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ లాడ్జ్ విషయంలోనూ ఇదే తతంగం నడిచిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

సాకులతో చుక్కలు..
ఖానాపురం హావేలి కల్లూరి నగర్లో ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఓ బాధితుని పరిస్థితి దయనీయం. సదరు యజమాని స్థలానికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు రెండు నెలల క్రితమే అనుమతులు ఇచ్చిన అధికారులు, అదే స్థలానికి వచ్చేసరికి ‘ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీ కావాలి’ అంటూ షార్ట్ఫాల్ కొట్టడం గమనార్హం. పక్కన ఇళ్లకు అనుమతి ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు ఎలా వచ్చిందని బాధితుడు ప్రశ్నిస్తున్నా, అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు.
తండ్రి సుడాలో.. కొడుకు టౌన్ ప్లానింగ్లో..
ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అపార అనుభవం ఉన్న తండ్రి ‘సుడా’లో పనిచేస్తుండగా, ఆయన కుమారుడు నగర పాలక సంస్థలో టీపీబీఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల జోడీ కనుసన్నల్లోనే అనుమతులు నడుస్తున్నాయని, చిన్న చిన్న పొరపాట్లను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కమిషనర్ మౌనం.. అంతే సంగతులు!
ఒకప్పుడు సిబ్బంది కొరత వల్ల పనులు ముందుకు సాగడం లేదని సాకులు చెప్పిన అధికారులు, ఇప్పుడు సిబ్బంది పుష్కలంగా ఉన్నా సరే.. పనులు ముందుకు కదలడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. టౌన్ ప్లానింగ్లో ఇంత జరుగుతున్నా, నగర పాలక సంస్థ కమిషనర్ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విభాగం పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

