సొసైటీ పేరుతో మాయ
రిజిస్ట్రేషన్ లేకుండానే అగ్రిమెట్లు
అభివృద్ధి పేరుతో.. చర్చి ఆస్తి విక్రయం?
పన్నుల ఎగవేత.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
బహుళ అంతస్తుల నిర్మాణంలోనూ అక్రమాలు
ఆన్లైన్లో మాయమైన సొసైటీ వివరాలు
సమాధానం చెప్పలేకపోతున్న అధికారులు
కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో వెలిసిన ఒక బహుళ అంతస్తుల భవనం ఇప్పుడు వివాదాలకు నిలయంగా మారింది. ‘ఆంధ్ర సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరును అడ్డం పెట్టుకుని సదరు సంస్థ భారీగా ఆస్తి పన్నును ఎగవేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, ఆన్లైన్ పోర్టల్లో అస్పష్టమైన రికార్డుల కారణంగా ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయల ఆదాయం గండిపడుతోంది. నగరంలోని ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధి, సర్వే నంబర్ 257లో 2020లో ‘టీఎస్-బీపాస్’ అనుమతులతో ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అయితే అక్కడ ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన మూడు ఇంటి నంబర్లనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొత్తగా నిర్మించిన భారీ భవనానికి కూడా పాత కాంప్లెక్స్ పన్నునే చెల్లిస్తూ, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ తతంగం వల్ల ప్రభుత్వానికి ఏటా లక్షల రూపాయల ఆదాయం నష్టపోవాల్సి వస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
సొసైటీ బైలా.. ఆన్లైన్లో ఏదీ?
1968లో స్థాపించబడిన ఈ సొసైటీకి సంబంధించిన కీలకమైన వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్ పోర్టల్లో ఎక్కడా కనిపించడం లేదు. సంస్థ రెన్యువల్ కోసం పదేపదే దరఖాస్తు చేసుకున్నామని చెబుతున్నా, అవేవీ ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఫాదర్ అంబటి జేవియర్ బాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ సంస్థలో మరో ఆరుగురు సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన మినిట్స్, బైలా వివరాలు ఆఫ్లైన్లో కూడా దొరక్కపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
అభివృద్ధి పేరుతో.. చర్చి ఆస్తి విక్రయం?
నిర్మాణంలో కొంత భాగాన్ని అభివృద్ధి పేరుతో 2012లో ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి మూడున్నర కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలుస్తోంది. సొసైటీ పేరు మీద ఉన్న చర్చి ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఒక కాంట్రాక్టర్ అల్లుడు చక్రం తిప్పారని, ఆ సమయంలో ఆయన ఆఫ్రికాలో ఉండి అంతా నడిపించారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నేపాల్లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సొసైటీ వ్యవహారాల్లో పారదర్శకత లోపించడం, చర్చి ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించేనా?
ఈ బహుళ అంతస్తుల భవనంపై, సొసైటీ లావాదేవీలపై మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పన్ను ఎగవేతపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను వసూలు చేయడంతో పాటు, సొసైటీ రికార్డులను బహిర్గతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

