మాదకద్రవ్యాల కట్టడే లక్ష్యం
బేసిక్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి
సాంకేతికతతో స్మార్ట్ పోలీసింగ్
అదుపులోకి వస్తున్న డ్రగ్స్ రవాణా
భూ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దు
సైబర్ నేరాలపై నిరంతర నిఘా ఉండాలి
ఖమ్మం పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశా నిర్దేశం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాల నియంత్రణపై యుద్ధం ప్రకటించాలని, భావితరాలను కాపాడటమే ధ్యేయంగా ప్రతి పోలీస్ అధికారి పనిచేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అదే సమయంలో ప్రాథమిక పోలీసింగ్కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఎస్బీ కాన్ఫరెన్స్ హాల్లో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. పోలీస్ యూనిఫాం ధరించడం అదృష్టంగా భావించి ప్రజల రక్షణే పరమావధిగా పనిచేయాలని, కోట్ల మంది జనాభాలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకు అంకితం కావాలని సూచించారు.
ఆస్తి నేరాలను అరికట్టేందుకు గస్తీ
బేసిక్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయడం ద్వారా ఆస్తి నేరాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. చట్టం అనేది సామాన్యులకు రక్షణ కవచంలా ఉండాలి తప్ప, చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గూండాల పట్ల కఠినమైన పోలీసింగ్ తప్పదని హెచ్చరించారు. సివిల్, భూ వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి మాఫియా, రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాంకేతికతతో నేరాల కట్టడి
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, హాక్ ఐ, తెలంగాణ కాప్స్ వంటి సాంకేతిక వేదికలను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, సీసీ కెమెరాలు, డేటా అనలిటిక్స్, సాక్ వ్యవస్థలతో నేరాల నియంత్రణను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల కంటే గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా ఇప్పుడు పెద్ద సవాలుగా మారిందని, వీటిని అరికట్టేందుకు ఈగల్ పోలీస్ బృందాలతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ ముఠాలపై నిరంతర నిఘా ఉంచి పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యం
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచాలని, నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అడ్డుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు వేగ పరిమితులు పాటించాలని, ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరి అని, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కోసం ఈగల్ తరహాలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్షలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, అదనపు డీసీపీలు రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, మహేష్, శ్రీనివాసులు, సర్వర్, సత్యనారాయణ, సుశీల్ సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

