- వడ్డీ లేని రుణాల పరిమితి రూ.10 లక్షలకు పెంపు
- మహిళా సంఘాలకు 1 లక్ష కోట్ల రుణాలు అందించడమే లక్ష్యం
- రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం
- 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ
- రైతు భరోసా నిధుల పంపిణీలో అద్భుత రికార్డు
- వడ్డీ లేని రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రకటన
కాకతీయ, చింతకాని: మహిళలను ఆర్థికాభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించిన ఆయన, మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం హయాంలో మొత్తం 1 లక్ష కోట్ల రుణాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళలకు 67 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని, గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టిన వడ్డీ లేని రుణాలను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన వెల్లడించారు.
రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీరు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్క్ఫెడ్ కార్యకలాపాల బలోపేతానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోలు ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని, మాటలతో కాదు చేతలతో రైతు సంక్షేమాన్ని నిరూపిస్తున్నామని తెలిపారు.
పాత బకాయిల చెల్లింపు
గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 5 వేలు మాత్రమే ఇచ్చేదని, ఆ డబ్బులు జమ చేసేందుకు 160 రోజులు పట్టేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని, రైతుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారాలే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని, ఆ వెన్నెముకను మరింత బలోపేతం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

