చెరువు మింగేస్తున్న కబ్జా రాయుళ్లు
నిమ్మకు నీరెత్తినట్లుగా ఇరిగేషన్ శాఖ!
నివేదికలు ఇచ్చినా కదలని రెవెన్యూ యంత్రాంగం
“నన్నేం చేయమంటారు..?” అంటూ బాధ్యతారాహిత్యంగా ఏఈ సమాధానం
రెండేళ్లుగా ఫైళ్లకే పరిమితమైన ఎర్రచెరువు ఆక్రమణల కేసు
సర్వేల పేరుతో అధికారుల కాలయాపన
కలెక్టర్ జోక్యం కోసం నరసింహరావుపేట గ్రామస్థుల ఎదురు చూపు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహరావుపేటలోని ఎర్రచెరువు అక్రమణల వ్యవహారం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ స్వయంగా గుర్తించి నివేదిక సమర్పించి రెండేళ్లు గడిచినా, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయి. బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ, అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడిన వివరాల ప్రకారం, అప్పటి ఇరిగేషన్ ఏఈ ఆయేషా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, చెరువు పరిధిలో ఆక్రమణలు జరిగినట్లు అధికారికంగా నిర్ధారించారు. ఆక్రమణలను వెంటనే తొలగించాల్సిందిగా తహసీల్దార్కు లేఖ రాశారు. అయితే, ఆ నివేదిక ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్లలో దుమ్ము పడుతోంది తప్ప, ఆక్రమణల తొలగింపునకు అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన శాఖలే, కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
“నన్నేం చేయమంటారు..?” .. అధికారుల బాధ్యతారాహిత్యం!
ఈ సమస్యపై ప్రస్తుత ఇరిగేషన్ ఏఈని వివరణ కోరగా, ఆమె స్పందించిన తీరు విస్మయానికి గురిచేసింది. “రెండేళ్లుగా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రెవెన్యూ అధికారులదే బాధ్యత” అంటూ ఆమె బాధ్యతారహితంగా సమాధానమిచ్చినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అటు తహసీల్దార్ కరుణాకర్ రెడ్డిని సంప్రదించగా, “ఇరిగేషన్ అధికారులు స్పష్టమైన లేఖ ఇస్తే ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.. మా సిబ్బందితో మళ్లీ సర్వే చేయిస్తాం” అని పాత పాటనే పాడారు. అధికారుల ఈ ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది.
చెరువు కనుమరుగు.. రైతుల ఆందోళన
ఎర్రచెరువు గ్రామానికి కీలక జలవనరు. ఆక్రమణల కారణంగా చెరువు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, జలవనరుల కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టుకోవడం వల్ల చెరువు ఉనికి ప్రమాదంలో పడింది.
కలెక్టర్ జోక్యం కోసం గ్రామస్థుల డిమాండ్
రెండేళ్లుగా జరుగుతున్న ఈ తతంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని విచారించి, తక్షణమే ఎర్రచెరువును ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. “నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఆ నివేదికల ప్రయోజనం ఏంటి?” అని గ్రామస్థులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని, ఎర్రచెరువును కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.

