అమ్మకానికి చెరువులోని చెట్లు
వందల చెట్లను నరికేసేందుకు రూ.1.40 లక్షలకు భేరం!
అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ చెరువులో వన మేధానికి ప్రయత్నాలు
నిబంధనలకు విరుద్ధంగా నరికివేతకు రంగం సిద్ధం
ఒక్కో చెట్టుకూ ధర కట్టిన అంకుషాపురం గ్రామానికి చెందిన కొందరు
అధికారుల అనుమతులు లేకుండానే నరికివేతకు ప్లాన్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన ఓ చెరువులోని చెట్ల విక్రయ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ప్రజల ఆస్తిగా పరిగణించాల్సిన చెరువు పరిధిలోని విలువైన చెట్లను అక్రమంగా విక్రయించేందుకు కొందరు యత్నిస్తుండటం గ్రామస్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. రూ.1.40 లక్షల వరకు భేరం కుదిరిందని, రేపోమాపో చెట్లను నరికివేసేందుకు అక్రమార్కులు సిద్ధమవుతున్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. చెరువు పరిధిలో ఉన్న చెట్లు ప్రజా ఆస్తి కిందకే వస్తాయి. వీటిని తొలగించాలన్నా లేదా విక్రయించాలన్నా అటవీ శాఖ, నీటి పారుదల శాఖ వంటి సంబంధిత విభాగాల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఈ వ్యవహారంలో ఎటువంటి పారదర్శకత లేకుండా, అధికారుల ప్రమేయం లేదా అనుమతులు ఉన్నాయో లేదో తెలియకుండానే చెట్లను నరికేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు సాగిస్తున్న ఈ దందాపై గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణానికి ముప్పు.. ఆందోళనలో గ్రామస్థులు
చెట్లను నరికివేస్తే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిసరాల్లోని సహజ సౌందర్యం దెబ్బతినడమే కాకుండా, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చెరువు గట్టున ఉన్న చెట్లు భూసారాన్ని కాపాడటంతో పాటు, పక్షులకు ఆవాసంగా ఉంటున్నాయని, వాటిని తొలగించడం వల్ల ఊరికి తీరని నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు.
అధికారులు స్పందించాలి.. సమగ్ర విచారణ జరగాలి!
ఈ వ్యవహారంపై సంబంధిత మండల అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ చెట్లను విక్రయించడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఆ రూ.1.40 లక్షల బేరం ఎవరి మధ్య కుదిరింది? వంటి అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ నరికివేతను వెంటనే అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు మౌనం వహిస్తే ప్రజా ఆస్తి అన్యాక్రాంతం కావడం ఖాయమని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

