సీఎంఆర్ దందాలో పెద్ద చేపలెవరు..?
చిన్న మిల్లులకే ఉచ్చు.. బడా మిల్లర్లకు మినహాయింపా..?
టార్గెట్గా చేసుకుని విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయా..?
బకాయిలున్న మిల్లర్లకే మళ్లీ ధాన్యం కేటాయింపులా..?
స్టాక్ లెక్కలు, సీఎంఆర్ బియ్యంపై సమగ్ర విచారణకు డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నప్పటికీ, ఆ చర్యలు అందరికీ సమానంగా అమలవుతున్నాయా? లేక కొందరికే పరిమితమయ్యాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్న రైస్ మిల్లులపైనే కేసులు నమోదు చేస్తూ, భారీ స్థాయిలో సీఎంఆర్ నిర్వహించిన బడా మిల్లర్ల వ్యవహారంపై అదే స్థాయిలో దృష్టి సారించలేదనే ఆరోపణలు జిల్లాలో చర్చకు దారితీశాయి. దీంతో మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలనే డిమాండ్ బలపడుతోంది.
బకాయిలున్నా… మళ్లీ కేటాయింపులా..?
గత సీజన్ల సీఎంఆర్ బకాయిలు, పెనాల్టీలు, వివాదాలు ఉన్నప్పటికీ కొందరు మిల్లర్లకు మళ్లీ ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం బకాయిలు పూర్తిగా చెల్లించిన తర్వాతే కొత్త కేటాయింపులు జరగాల్సి ఉండగా, ఆ ప్రక్రియను పూర్తిగా పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్యాంకు గ్యారంటీలు, అర్హత ప్రమాణాలు, ఒప్పంద నిబంధనల అమలుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రైస్ మిల్లుల్లో రికార్డుల్లో చూపిన ధాన్యం నిల్వలకు, వాస్తవ స్టాక్కు మధ్య వ్యత్యాసాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎంఆర్ బియ్యం నిల్వలు, రవాణా వివరాలు, గోదాముల లెక్కలను సమగ్రంగా పరిశీలిస్తే అసలు పరిస్థితి బయటపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా ధాన్యం తరలింపు, రికార్డుల నిర్వహణలో లోపాలపై కూడా లోతైన విచారణ అవసరమని పలువురు కోరుతున్నారు.
అందరికీ ఒకే న్యాయం ఉండాలి
అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా చట్టం ముందు సమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. చిన్న మిల్లులపై మాత్రమే చర్యలు తీసుకుని, పెద్ద మిల్లర్లను వదిలేస్తే విచారణపై అనుమానాలు పెరుగుతాయని చెబుతున్నారు. జిల్లాలోని అన్ని రైస్ మిల్లులను ఒకే ప్రమాణంతో తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సమానంగా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి నష్టం చేసిన అసలు బాధ్యులు బయటపడతారని అభిప్రాయపడుతున్నారు. సీఎంఆర్ బియ్యం వ్యవహారంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా జిల్లాలోని అన్ని మిల్లులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, గత మూడు సీజన్ల ధాన్యం కేటాయింపులు, సీఎంఆర్ బకాయిలు, స్టాక్ రికార్డులు, బ్యాంకు గ్యారంటీలను సమగ్రంగా పరిశీలించాలని రైతు సంఘాలు, మిల్లింగ్ రంగానికి చెందిన పలువురు కోరుతున్నారు. సమగ్ర విచారణ ద్వారానే ఆరోపణలకు తెరపడుతుందని, ప్రభుత్వ ధాన్యం నిర్వహణలో పారదర్శకతకు భరోసా లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

