పోడు సాగుదారులపై దాడులను ప్రతిఘటించాలి
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకుంటాం
గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతులు కల్పించడంలో పాలకుల వైఫల్యం
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను సమిష్టిగా అడ్డుకుందాం
గుండాల ప్రాంతంలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
కాకతీయ, గుండాల : గుండాల ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులు సాగు చేసుకుంటున్న భూములకు తక్షణమే హక్కులు కల్పించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా గుండాల మండలంలో కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న పోడు సాగుదారులపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సాబీర్ పాషా ఆరోపించారు. సాగుభూములను లాక్కోవడం అటవీ హక్కుల చట్టాన్ని నీరుగార్చడమేనన్నారు. తక్షణమే సాగుదారులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీని నిర్వీర్యం చేయొద్దు
గ్రామీణ పేదలకు ఆధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. మారుమూల గ్రామాలకు కనీస రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తోందని సాబీర్ పాషా ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. గుండాల ప్రాంతంలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బద్లావ్ జరూరీ హై నినాదంతో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీమ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ అధ్యక్షతన యాత్ర జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, పినపాక నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డి పుల్లారెడ్డి, సీపీఐ కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి, సీపీఐ కార్యవర్గ సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్, బచ్చల రామయ్య, లక్ష్మయ్య, సమ్మయ్య, సమీర్, సంధ్యారాణి, నాగమణి, ఎర్రమ్మ, అప్రోచ్, నాసిర్, షబ్బీర్, పవన్ కళ్యాణ్, రవి వర్మ, వంశీ, వరుణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

