పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు ఇదే వైఖరి
రీచుల్లో అక్రమ వసూళ్లు ఆపాలంటూ లారీ ఓనర్ల ఆందోళన
వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలని డిమాండ్
లారీ అసోసియేషన్ల నిరసనకు మరుసటి రోజే కాంట్రాక్టర్ల నిర్ణయం
లోడింగ్ చేయకుంటే చర్యలు తీసుకుంటామంటున్న అధికారులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక రీచుల్లో అక్రమ వసూళ్లు, పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఇసుక లోడింగ్ చేయబోమంటూ కాంట్రాక్టర్లు బుధవారం నిరసనకు దిగారు. క్వారీల్లోకి వెళ్లిన లారీలకు లోడింగ్ నిలిపేశారు. రీచుల్లో లోడింగ్కు అక్రమంగా చేస్తున్న అదనపు వసూళ్లను ఆపాలంటూ మంగళవారం హైదరాబాద్లోని టీజీఎండీసీ ప్రధాన కార్యాలయం ఎదుట లారీ అసోసియేషన్ నేతలు ధర్నా చేపట్టిన మరుసటి రోజున బుధవారం ఇసుక కాంట్రాక్టర్లు లోడింగ్ నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇసుక క్వారీల్లో అక్రమ వసూళ్లను అరికడతామని టీజీఎండీసీ ఎండీ లారీ అసోసియేషన్ నేతలకు హామీ ఇచ్చారు. ఈ పరిణామం తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్లు లోడింగ్ నిలిపివేయడంపై గమనార్హం. ఒక వైపు రీచుల్లో నిర్ణయించిన ధరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారంటూ లారీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకుని, నిబంధనల ప్రకారం చెల్లింపులు చేసినా క్షేత్రస్థాయిలో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారని లారీ అసోసియేషన్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీజీఎండీసీ అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ బిల్లులపై కాంట్రాక్టర్ల ఆందోళన
ఇసుక రీచుల్లో తాము నిర్వహిస్తున్న పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. బకాయిలు చెల్లించకుండా పనులు కొనసాగించడం తమకు ఆర్థికంగా భారంగా మారుతోందని చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఇసుక లోడింగ్ ప్రక్రియను నిలిపివేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు లారీ ఓనర్లు మాత్రం కాంట్రాక్టర్ల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పటికే బుకింగ్ చేసుకుని చెల్లింపులు చేసినప్పటికీ లోడింగ్ చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అంటున్నారు. ఒకవైపు అదనపు వసూళ్లు, మరోవైపు లోడింగ్ నిలిపివేతతో ఇసుక రవాణా వ్యవస్థ గందరగోళంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీచుల్లో అక్రమ వసూళ్లను నిలిపివేయాలని, లారీ యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లారీ అసోసియేషన్ల ప్రతినిధులు మంగళవారం టీజీఎండీసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రీచుల్లో జరుగుతున్న వసూళ్లపై అధికారులకు ఫిర్యాదు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ నిరసన జరిగిన మరుసటి రోజే కాంట్రాక్టర్లు లోడింగ్ నిలిపివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. తమ పెండింగ్ బిల్లులు చెల్లించకుండా లోడింగ్ చేయలేమని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రీచుల వద్ద ఇసుక లోడింగ్, రవాణా వ్యవహారం నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.


అధికారుల హెచ్చరిక
ఇసుక లోడింగ్ నిలిపివేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీచుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్, రవాణా ప్రక్రియ సజావుగా కొనసాగాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి తప్ప ఇసుక లోడింగ్ను నిలిపివేయడం ద్వారా సమస్యను మరింత జటిలం చేయడం సరికాదని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. లారీ ఓనర్లు చేసిన అక్రమ వసూళ్ల ఆరోపణలపైనా అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రీచుల్లో నిర్ణయించిన ధర ఎంత? అదనపు వసూళ్లకు అనుమతి ఉందా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్నారు? ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎవరి వాదనలో వాస్తవం?
ఒకవైపు లారీ యజమానులు అక్రమ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు కాంట్రాక్టర్లు తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతున్నారు. దీంతో ఇసుక రీచుల్లో అసలు సమస్య ఎక్కడ ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు నిజంగా పెండింగ్లో ఉంటే వాటి వివరాలను టీజీఎండీసీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. అదే సమయంలో లారీ ఓనర్లు ఆరోపిస్తున్న అదనపు వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక రీచుల్లో లారీ ఓనర్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకునే పరిస్థితి కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లారీ యజమానులు, ఇసుక వినియోగదారులు కోరుతున్నారు. ఇసుక రవాణా నిలిచిపోవడంతో నిర్మాణ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు ఉంటే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల అంశాన్నీ పరిష్కరించి రీచుల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని పలువురు కోరుతున్నారు.

