ఇంటర్ ప్రవేశాలకు ఆగస్టు 31 వరకు గడువు
ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు మరో అవకాశం
ప్రవేశాల్లో నిబంధనలు తప్పనిసరి
పదో తరగతి ఫలితాల ఆధారంగానే సీట్లు
తెలంగాణ మాధ్యమిక విద్యా బోర్డు ఆదేశాలు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ మాధ్యమిక విద్యా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పించిన బోర్డు, ప్రవేశ ప్రక్రియలో రిజర్వేషన్, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ సగటు, విషయాల వారీగా గ్రేడ్ పాయింట్లు, అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సహాయ, ప్రైవేటు స్వతంత్ర, సహకార, తెలంగాణ నివాస, సాంఘిక సంక్షేమ నివాస, గిరిజన సంక్షేమ నివాస, మోడల్, కేజీబీవీ, తెలంగాణ గురుకుల విద్యా సంస్థలు, బీసీ సంక్షేమ, ప్రోత్సాహ జూనియర్ కళాశాలలతో పాటు రెండేళ్ల ఇంటర్ కోర్సును అందిస్తున్న సమ్మిళిత డిగ్రీ కళాశాలలకు ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. కళాశాలలు బోర్డు నిర్దేశించిన షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలి.
ప్రవేశ పరీక్షలకు నో
ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల పదో తరగతి గ్రేడ్లు, మార్కుల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలి. రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, ఎన్సీసీ, క్రీడలు, ఇతర కార్యకలాపాలకు 5 శాతం, తెలంగాణలో నివసిస్తున్న మాజీ సైనికులు, రక్షణ సిబ్బందికి 3 శాతం, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొంది. బాలికల కోసం ప్రత్యేక కళాశాలలు లేని ప్రాంతాల్లో మొత్తం సీట్లలో 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయించాలని బోర్డు ఆదేశించింది. గ్యాప్ కాలం తర్వాత ఇంటర్లో చేరే విద్యార్థులు ఆ వ్యవధికి సంబంధించి స్థానిక అభ్యర్థి లేదా నివాస ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత తహసీల్దార్ నుంచి పొందాలి. జోగిని పిల్లల విషయంలో తండ్రి పేరు స్థానంలో తల్లి పేరును నమోదు చేయాలని స్పష్టం చేసింది.
సీట్ల భర్తీపై పరిమితులు
ప్రైవేటు స్వతంత్ర జూనియర్ కళాశాలలు బోర్డు అనుమతించిన విభాగాల్లోనే ప్రవేశాలు కల్పించాలి. ఒక్కో విభాగంలో గరిష్ఠంగా 88 మంది విద్యార్థులకే ప్రవేశం ఇవ్వాలి. బోర్డు నిలిపివేసిన కాంబినేషన్లలో ప్రవేశాలు కల్పించరాదని హెచ్చరించింది. అదనపు విభాగాలను ప్రారంభించాలంటే ముందుగా బోర్డు అనుమతి తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కళాశాలలు ప్రవేశ ద్వారం వద్ద అనుమతించిన విభాగాలు, మొత్తం సీట్లు, భర్తీ అయిన సీట్లు, ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలి. ప్రవేశ సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ప్రకటనను తప్పనిసరిగా తీసుకోవాలి. బాలికల భద్రత, రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. విదేశీ పౌరులు, విదేశాల్లోని భారతీయ పౌరులు ప్రవేశం పొందిన సందర్భంలో సంబంధిత నిబంధనలను పాటించాలని బోర్డు ఆదేశించింది. ప్రవేశం పొందిన 24 గంటల్లో సంబంధిత పోలీస్ స్టేషన్కు నిర్ణీత ఫారమ్ ప్రతిని సమర్పించాలి. విద్యార్థులు బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని, గుర్తింపు లేని కళాశాలల్లో చేరి నష్టపోవద్దని సూచించింది.

