భూముల కబ్జా వెనుక రేవంత్ రెడ్డి హస్తం
బొమ్మరాసిపేటలో 1000 ఎకరాలపై కన్ను
రెవెన్యూ మంత్రి సహకారంతోనే 22 వేల అక్రమ రిజిస్ట్రేషన్లు
వజ్రేష్ యాదవ్, ఉదయ సింహా రెడ్డి, అనిల్ రెడ్డి, అంజి రెడ్డి, ఎ.వి రెడ్డి ఎవరు?
రైతుల భూములను కాపాడే వరకు పోరాటం కొనసాగుతుంది
జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తాం
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : బొమ్మరాసిపేట రైతుల భూముల కబ్జా వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని, రెవెన్యూ మంత్రి సహకారంతోనే 22 వేల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రైతులకు తెలియకుండానే, వారి ప్రమేయం లేకుండానే భూములను ఇతరుల పేర్లకు మార్చుతున్నారని, తెలంగాణలో దొంగల చేతికి భూముల తాళాలు ఇచ్చినట్లుగా పరిస్థితి తయారైందని విమర్శించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం బొమ్మరాసిపేటలో రైతుల భూ ఆక్రమణలకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాలో డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మంత్రి లక్ష్శారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బొమ్మరాసిపేటలో రైతులకు సంబంధించిన 1000 ఎకరాల అత్యంత విలువైన భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అనుచరులు, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకొని ఈ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
2007లో రైతులవేనని ధ్రువీకరణ
2007లో అప్పటి కలెక్టర్ ముద్దడ రవిచంద్ర ఈ భూములు రైతులవేనని అధికారికంగా ధ్రువీకరించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ ఆర్డీవో రైతులకు నోటీసులు ఎందుకు పంపుతున్నారని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ధోరణిలో లోపాలున్నాయంటూ భూభారతి పోర్టల్ తీసుకొచ్చి, కార్యాలయాన్ని ఎన్ఐసీలో పెట్టి, ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి తన వద్దే అన్ని అధికారాలను కేంద్రీకరించుకున్నారని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న మార్పులు చేయాలన్నా రెవెన్యూ మంత్రి అనుమతి తప్పనిసరి చేశారని అన్నారు. ఈ కారణంగానే సుమారు 22 వేల ఫైళ్లలో చట్టవిరుద్ధంగా రికార్డులు మార్చారని, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ అనుమతి లేకుండానే ఈ మార్పులు జరిగాయని ఆరోపించారు.
విలువైన భూములపై అనుచరుల కన్ను
వట్టినాగులపల్లి, కోకాపేట, మోకిల, యాచారం, బొమ్మరాసిపేట ప్రాంతాల్లోని విలువైన భూములపై ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అంజిరెడ్డి, అనిల్ రెడ్డి, ఉదయ సింహా రెడ్డి, ఎ.వి రెడ్డి, వజ్రేష్ యాదవ్ వంటి వ్యక్తులను పంపి రైతులను బెదిరించడం, నకిలీ పత్రాలు సృష్టించడం, అధికారులపై అక్రమ ఆదేశాలు జారీ చేయడం ద్వారా భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. వజ్రేష్ యాదవ్, ఉదయ సింహా రెడ్డి, అనిల్ రెడ్డి, అంజి రెడ్డి, ఎ.వి రెడ్డి ఎవరో, వారికి సచివాలయంలో ఏం పని ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లగచర్ల భూముల విషయంలోనూ రైతుల భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు బొమ్మరాసిపేట రైతుల భూములను రక్షించాలని, వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు లేఖ రాశారని తెలిపారు. ఇప్పుడు అదే రైతుల భూముల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
రైతుల వెంట బీఆర్ఎస్
భూములను రక్షించుకునేందుకు పోరాడుతున్న రైతులను లగచర్ల రైతుల మాదిరిగా జైలుకు పంపే ప్రయత్నం చేస్తే వారితో పాటు తామూ జైలుకు వెళ్తామని ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు చందాలు వేసుకొని పత్రికలకు ప్రకటనలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని, రైతుల పోరాటాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోంశాఖతో పాటు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను తన వద్దే ఉంచుకున్నారని, తన మిత్రుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెవెన్యూ శాఖతో పాటు సమాచార పౌరసంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు. భూ దందాలు బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులపై అక్రమ ఒత్తిళ్లు తెచ్చి చట్టవిరుద్ధమైన పనులు చేయిస్తే భవిష్యత్తులో చర్లపల్లి జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని తెలిపారు. అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని, హైకోర్టులో మరోసారి కేసు వేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

