టికెట్ చిచ్చు.. బహిరంగ పోరు!
వనపర్తి కాంగ్రెస్లో రెండు వర్గాల పోరు
మేఘారెడ్డిపై చిన్నారెడ్డి సంచలన ఆరోపణలు
డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నట్లు నిరూపించాలి
చిన్నారెడ్డికి మేఘారెడ్డి ఘాటు కౌంటర్
అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానంటూ ప్రకటన
కాకతీయ, వనపర్తి : వనపర్తి కాంగ్రెస్లో చాలాకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ పోరుగా మారాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత జి.చిన్నారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు.. వాటికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇచ్చిన కౌంటర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల టికెట్ వ్యవహారాన్ని కేంద్రంగా చేసుకుని ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం మొదలైంది. ఇన్నాళ్లూ తెరవెనుక సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు వేదికలెక్కిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఎన్నికల్లో వనపర్తి కాంగ్రెస్ టికెట్ కోసం చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య పోటీ నెలకొంది. తొలుత చిన్నారెడ్డికి టికెట్ ఖరారైనట్లు ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో అధిష్ఠానం మేఘారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఇరువర్గాల మధ్య రాజకీయ దూరం కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా గోపాల్పేటలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి. డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని మేఘారెడ్డిపై ఆయన ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినా.. కొందరు డబ్బులకు ఆశపడి ఆ నిర్ణయాన్ని మార్చించారని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో తన వర్గం నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూడా విమర్శించారు.
‘ఆధారాలతో నిరూపించండి’
చిన్నారెడ్డి ఆరోపణలకు ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే స్థాయిలో స్పందించారు. తాను డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నానని ఆరోపిస్తున్న వారు.. ఎవరికి, ఎప్పుడు, ఎంత డబ్బు ఇచ్చానో ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. పార్టీ నిర్వహించిన సర్వేలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అధిష్ఠానం తనకు టికెట్ ఇచ్చిందని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమని మేఘారెడ్డి ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
పాత మాటలు.. కొత్త రాజకీయాలు
చిన్నారెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా మేఘారెడ్డి ప్రస్తావించారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇకపై తాను పోటీ చేయబోనని, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అప్పటి వ్యాఖ్యలకు పొంతన లేదని ప్రశ్నించారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలోనూ ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఐటీ టవర్, విద్యార్థుల వసతిగృహాలు, మార్కెట్ తదితర అంశాలపై చిన్నారెడ్డి విమర్శలు చేయడం.. వాటికి ఎమ్మెల్యే వర్గం నుంచి ప్రతిస్పందనలు రావడం చాలాకాలంగా జరుగుతోంది. వనపర్తిలో సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు బహిరంగం కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానానికి కొత్త తలనొప్పి మొదలైనట్లయింది. ఇరువర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఎవరికి మద్దతుగా నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే రోజుల్లో నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో ఈ విభేదాల ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ సాగుతోంది. టికెట్ వ్యవహారంతో మొదలైన అసంతృప్తి.. ఆధిపత్య పోరుగా మారి.. ఇప్పుడు బహిరంగ ఆరోపణలు, సవాళ్లకు దారితీసింది. ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నా రాజకీయంగా మాత్రం దూరం పెరుగుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుంటుందా? లేక వివాదం మరింత ముదురుతుందా? అన్నది వనపర్తి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.

