22ఏ భూములపై సీఐడీ విచారణ జరపాలి
లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటున్నారు
తెలంగాణ భవన్లో 10 మంది న్యాయవాదులతో ఉచిత లీగల్ సెల్
20, 30 శాతం కమీషన్లు ఇవ్వొద్దు.. తక్కువ ధరకు ఆస్తులు అమ్ముకోవద్దు
స్పందించకపోతే బాధితులతో కలిసి సీఎం ఇంటి ముట్టడి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న 22ఏ నిషేధిత భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. చిన్న చిన్న అంశాలకే సీఐడీ, విజిలెన్స్ విచారణలు చేపట్టే సీఎం రేవంత్రెడ్డి.. వేలాది ఎకరాల భూములు 22ఏ జాబితాలో చేరిన వ్యవహారంపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. 22ఏ బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


22ఏ వెనుక భారీ దందా
తెలంగాణ భవన్లో 22ఏ నిషేధిత భూముల వల్ల నష్టపోయిన బాధితులతో హరీశ్రావు ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు భూములను 22ఏ జాబితాలో చేర్చడం వెనుక 30 శాతం కమీషన్లు, 50–50 సెటిల్మెంట్ల దందా ఉందని ఆరోపించారు. హెచ్ఎండీఏ, హెచ్యూడీఏ ఆమోదించిన లేఅవుట్లలోని భూములను, 30 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఇళ్లను కూడా 22ఏలో చేర్చడం వెనుక పెద్ద మొత్తంలో కమీషన్ల వ్యవహారం నడుస్తోందని అన్నారు. బుద్వేల్ సర్వే నంబర్లు 282, 283, 284లోని 30 ఎకరాల భూమిని సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్పై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే 22ఏ నుంచి తొలగించి కోట్లాది రూపాయల దందా చేశారని ఆరోపించారు. శేరిలింగంపల్లి సర్వే నంబర్లు 20/1, 21లోని SAS ఇన్ఫ్రా ప్రాపర్టీని 30 శాతం కమీషన్తో 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించారని, బిల్డర్ పని పూర్తయిన తర్వాత మళ్లీ 22ఏలో చేర్చారని పేర్కొన్నారు.
40 వేల ఎకరాలపై సీఎం ఎందుకు మౌనం?
యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలను 22ఏలో చేర్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చెప్పినా ఆయన ఎందుకు స్పందించలేదని హరీశ్రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలిసి ఆడుతున్న వసూళ్ల నాటకమని ఆరోపించారు. పొంగులేటి కొద్ది రోజుల క్రితం ఒక్క ఎకరం కూడా 22ఏలో చేర్చలేదని చెప్పారని, ఇప్పుడు అధికారుల పొరపాటేనని చెబుతున్నారని అన్నారు. ఇలాంటి భిన్నమైన ప్రకటనలతో ప్రజలను ఎందుకు గందరగోళానికి గురిచేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసి ఉండొచ్చని.. బీఆర్ఎస్ నాయకులకు ప్రజల తరఫున పోరాటాలు చేయడం తెలుసని వ్యాఖ్యానించారు.
బాధితులకు ఉచిత న్యాయ సహాయం
22ఏ బాధితులకు అన్ని రకాల న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణ భవన్లో 10 మంది న్యాయవాదులతో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు హరీశ్రావు ప్రకటించారు. అడ్వకేట్ కళ్యాణ్ను సంప్రదిస్తే ఉచిత న్యాయ సేవలు అందిస్తారని తెలిపారు. లీగల్ సెల్ సహాయంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితుల వెంట ఉంటారని చెప్పారు. ఎవరూ భయపడి 20, 30 శాతం కమీషన్లు ఇవ్వొద్దని, ఆస్తులను తక్కువ ధరలకు అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం చేసిన తప్పును ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి ఆన్లైన్లో 22ఏ ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. అమీన్పూర్ కేఎస్ఆర్ కాలనీలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ 500 ఇళ్లను 22ఏలో చేర్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
స్పందించకపోతే సీఎం ఇంటి ముట్టడి
2008లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో సీలింగ్ రద్దయిన భూముల్లో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించిన ఇళ్లను కూడా ఇప్పుడు సీలింగ్ భూములుగా పేర్కొనడం దుర్మార్గమని హరీశ్రావు అన్నారు. అక్రమంగా 22ఏ జాబితాలో చేర్చిన భూములన్నింటినీ వెంటనే పునరుద్ధరించాలని, ఇందుకు బాధ్యులైన అధికారులపై, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డికి ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే పొంగులేటిని తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో స్పందించకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం ఇంటి ముట్టడి చేపడతామని హరీశ్రావు హెచ్చరించారు. సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దేవిరెడ్డి సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

