ఆర్టీసీ పరిరక్షణకు ఎస్డబ్ల్యూఎఫ్ను బలపరచండి
38 వేల మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం
పెరిగిన పనిభారాలను వెంటనే తగ్గించాలి
ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను అమలు చేయాలి
: సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు
కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్)ను రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు బలపరచాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. ఆర్టీసీలోని 38 వేల మంది కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ప్రభుత్వ, యాజమాన్య అనుకూల సంఘాలకు కాకుండా కార్మికుల పక్షాన నిలిచే సంఘానికి మద్దతు ఇవ్వాలని కోరారు. బుధవారం ఖమ్మంలోని మంచికంటి హాల్లో ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

పోరాటాల చరిత్ర ఎస్డబ్ల్యూఎఫ్దే
2019లో అప్పటి ప్రభుత్వం కార్మిక సంఘాలపై ఆంక్షలు విధించిన సమయంలో ఆర్టీసీలోని అనేక సంఘాలు మౌనం వహించాయని, ఎస్డబ్ల్యూఎఫ్ మాత్రం తన శక్తిమేరకు కార్మిక సమస్యలపై స్పందించి పోరాటాలు నిర్వహించిందని సాయిబాబు అన్నారు. ఆ సంఘం సుదీర్ఘంగా నిర్వహించిన పోరాటాల ఫలితంగానే 2026లో సమ్మె జరిగిందని పేర్కొన్నారు. రానున్న గుర్తింపు ఎన్నికల్లో కార్మికుల వైపు నిలిచే సంఘం కావాలా.. ప్రభుత్వానికి, యాజమాన్యానికి అనుకూలంగా ఉండే సంఘం కావాలా అన్నది కార్మికులు ఆలోచించాలని సూచించారు. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసి ఏళ్లు గడుస్తున్నా పలువురికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమన్నారు. సంస్థకు నష్టాలు వస్తున్నాయంటూ కార్మికులపై పనిభారం పెంచడం సరికాదన్నారు. పెరుగుతున్న డీజిల్, బస్సు విడిభాగాల ధరలు ప్రభుత్వ విధానాల ఫలితమేనని, వాటి భారాన్ని కార్మికులపై మోపడం సమంజసం కాదని అన్నారు. పెంచిన పనిభారాలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
విలీనం అంశంపై స్పష్టమైన వైఖరి
ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. ఆర్టీసీ కార్మికుల పని పరిస్థితులు, పెరిగిన పనిభారాలు, కార్మిక సమస్యలపై వివిధ యూనియన్ల వైఖరి, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యాజమాన్యం అంగీకరించిన అంశాల అమలుపై వివరించారు. ప్రభుత్వం అంగీకరించిన ఆర్టీసీ కార్మికుల విలీనం అంశంపై సమగ్ర అధ్యయనం చేసి స్పష్టమైన వైఖరితో ఉన్న ఏకైక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ అని తెలిపారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్లో నియమితులైన వారిని అపాయింట్మెంట్ తేదీ నుంచే రెగ్యులర్ చేయాలని చర్చల్లో అంగీకరింపజేశామని చెప్పారు. సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ప్రయోజనం అందేలా యాజమాన్యంతో చర్చించి యూబీఐ ద్వారా ఒప్పించామని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం కండక్టర్లకే కాకుండా డ్రైవర్లు, మెకానికల్ కేటగిరీ ఉద్యోగులు కూడా పరీక్ష రాసే అవకాశం కల్పించేలా ఒప్పించామని పేర్కొన్నారు. రానున్న గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన సంఘానికి విలీనం కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించిందన్నారు.
ఆర్టీసీని కాపాడాలి
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నప్పటికీ ఆర్టీసీ పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీలకే అప్పగించి, అవసరమైన ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం పలు తీర్మానాలు చేసింది. ఆర్టీసీలో ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని, పెంచిన 80 శాతం అలవెన్సులకు సంబంధించిన సర్క్యులర్ను విడుదల చేయాలని, జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 25న డిపోలు, రీజియన్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని తీర్మానించింది.
ఖమ్మంలో కార్మికుల ప్రదర్శన
ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బస్ డిపో మీదుగా మంచికంటి హాల్ వరకు ఆర్టీసీ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. బ్రెడ్ విన్నర్స్ స్కీమ్లో నియమితులైన వారిని అపాయింట్మెంట్ తేదీ నుంచే రెగ్యులర్ చేయాలని, ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను అమలు చేయాలని, 80 శాతం పెంచిన అలవెన్సులకు సర్క్యులర్ విడుదల చేయాలని, జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ పోస్టింగులు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రదర్శనలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ లింగమూర్తి, సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వర్లు, తుమ్మ విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాణాల రాంబాబు, వేము జాకబ్, ఖమ్మం రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు గుండు మాధవరావు, పిట్టల సుధాకర్, ఆర్టీసీ శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ జె.పద్మావతి, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ రీజియన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

