పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దు
5 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించాలి
బకాయిలు ఉన్న 500 మందిపై కఠిన చర్యలకు నిర్ణయం
జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి
30 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు ఆదేశం
కాకతీయ, వరంగల్: ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడాలని, కనీసం 30 శాతం లక్ష్యాన్ని సాధించేందుకు అంకితభావంతో కృషి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి స్పష్టం చేశారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయితో కలిసి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో 5 శాతం పన్ను రాయితీ పథకంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5 శాతం రాయితీ సదుపాయం మరో 8 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సువర్ణావకాశంపై క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. సకాలంలో పన్ను చెల్లించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక లాభం కలుగుతుందని, ఆ నిధులతో నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..
వసూళ్ల పురోగతిని సమీక్షించిన కమిషనర్ చాహత్ బాజ్పాయి, ఇప్పటివరకు కేవలం 8 శాతం మాత్రమే పన్ను వసూలు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. వసూళ్లలో వెనుకబడిన ఆర్ఐలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపరచుకోవాలని హెచ్చరించారు. సమావేశానికి గైరుహాజరైన వార్డు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రికవరీ చట్టం ప్రయోగం: అత్యధిక బకాయిలు ఉన్న మొదటి 500 మంది పన్ను చెల్లింపుదారులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను వసూళ్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన యంత్రాలు, వాహనాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోని సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, సమ్మయ్య, ప్రసన్నారాణి, తహసీల్దార్ రామకృష్ణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

