స్తంభించిన చక్రం.. విలవిలలాడుతున్న ప్రయాణికులు!
ఆర్టీసీ సమ్మెతో అస్తవ్యస్తమైన రవాణా వ్యవస్థ
డిపోల వద్దే నిలిచిపోయిన వేల సంఖ్యలో బస్సులు
ముందస్తు సమాచారం లేక బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు
ప్రైవేట్ వాహనదారుల అడ్డగోలు ఛార్జీలతో సామాన్యుల బేజారు
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కొనసాగుతున్న కార్మికుల నిరసన
మహిళలు, విద్యార్థులు, ఉద్యోగుల పడరాని పాట్లు
అద్దె బస్సుల కోసం అధికారుల ముమ్మర ప్రయత్నాలు
ప్రభుత్వ హామీల అమలు కోసమేనన్న ఆర్టీసీ కార్మిక జేఏసీ
కాకతీయ, నెట్వర్క్: టీజీఎస్ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా చక్రం స్తంభించిపోయింది. ప్రభుత్వం తమకు ఇచ్చిన 32 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన ఈ సమ్మెతో సామాన్య ప్రయాణికులపై పెను ప్రభావం పడింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సమ్మె విషయం తెలియక ఉదయాన్నే బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలతో ఉన్న మహిళలు సరైన రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో నిండిపోయినప్పటికీ, బస్సులు కదలకపోవడంతో గందరగోళం నెలకొంది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడమే అదనుగా ప్రైవేట్ ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను అమాంతం పెంచేశాయి. సాధారణ ఛార్జీల కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తుండటంతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక ధరలు చెల్లించి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
ఉచిత ప్రయాణానికి బ్రేక్
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ఇప్పుడు సమ్మె వల్ల మహిళలకు అందుబాటులో లేకుండా పోయింది. నిన్నటి వరకు రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించిన మహిళలు, నేడు ప్రైవేట్ వాహనాల కోసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరాల్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే వారికి ఆర్టీసీ బస్సులే ప్రధాన ఆధారం కావడంతో, వారి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా 641 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు 2 వేల మంది కార్మికులు నిరసనల్లో పాల్గొంటున్నారు. అలాగే ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోల ముందు కార్మికులు బైఠాయించి విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని 850 బస్సులు నిలిచిపోవడంతో జిల్లావ్యాప్తంగా రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రస్తుతానికి అధికారులు అద్దె బస్సులు మరియు ప్రైవేట్ డ్రైవర్ల సహాయంతో కొన్ని సర్వీసులను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అది ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఈ రవాణా కష్టాలు తీరేలా లేవు.
బైపాస్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బుధవారం ఉదయం కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై కరీంనగర్-2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.
అనుభవం లేని డ్రైవర్లతోనే ప్రమాదమా?
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో, ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తగిన అనుభవం లేని వ్యక్తులతో వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. సమ్మె ప్రభావం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కరువవుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి స్వల్పంగానే ఉన్నట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

