ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
గుండెపోటుతో దవాఖానలో తుదిశ్వాస
దర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు
49 చిత్రాలకు కో-డైరెక్టర్గా బాధ్యతలు
ఆయన అసలు పేరు వరప్రసాద్
త్రిపురనేని మహారథి కుమారుడిగా ఇండస్ట్రీకి..
చిట్టిబాబు ఆకస్మిక మరణంపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైటెక్ సిటీ కొండాపూర్ పరిధిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ చిట్టిబాబు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండె పోటుతో మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. చిట్టిబాబు ఆకస్మిక మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
‘అల్లూరి సీతారామరాజు’ రచయిత, ప్రముఖ నిర్మాత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. ఆయన అసలు పేరు వరప్రసాద్. 1955 జూలై 28న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. తండ్రి ముద్దుగా పిలిచుకునే ‘చిట్టి’ పేరుతోనే అందరికీ సుపపరిచితుడయ్యారు. సినిమాల మీద ఆసక్తితో తండ్రి బాటలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆత్రేయ, అప్పలాచార్య దగ్గర రచనశాఖలో అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత 1984లో ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘నా పేరు దుర్గస, ప్రళయం’, ‘ప్రేమించి చూడు’, ‘రైతు భారతం’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
సౌందర్యను పరిచయం చేసింది చిట్టిబాబే..
త్రిపురనేని చిట్టిబాబు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. 49 చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేశారు. ‘గరుడాచలం’, ‘భైరవ ద్వీపం’, ‘దశావతారం’ ‘జాతిరత్నాలు’, ‘జాంబీరెడ్డి’, ‘దర్జా’, ‘జిన్నా’ వంటి 30కి పైగా సినిమాల్లో నటించారు. అలానే నిర్మాతగానూ కొన్ని సినిమాలు రూపొందించారు. దివంగత నటి సౌందర్యని ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిట్టిబాబే. ఆయన దర్శకత్వంలో కృష్ణ, భాను చందర్, వాణీ విశ్వనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సౌందర్యని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ దీని కంటే ముందు ఆమె నటించిన ‘మనవరాలి పెళ్లి’ సినిమా రిలీజయింది. ఇదే సౌందర్య డెబ్యూ మూవీగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత చిట్టిబాబు దర్శకత్వంలో సౌందర్య ‘గెలుపు’ అనే సినిమా చేశారు. ఎమ్మెస్ నారాయణని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా చిట్టిబాబే. తనను డైరెక్టర్ ని చేసింది మంచు మోహన్ బాబు అని చిట్టిబాబు పలు సందర్భాల్లో చెప్పారు.

