అక్షర సేద్యం.. ప్రభుత్వ బడికి మార్గం
దేశాయిపేటలో ‘బడిబాట’ ఉత్సాహం
ఇంటింటి ప్రచారంతో చైతన్యం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో భాగంగా ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం – మన పిల్లలను సర్కారు బడిలోనే చేర్పిద్దాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు మధ్యాహ్న భోజన పథకంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో MPHW గ్రూపులో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన పూర్వ విద్యార్థిని ఇసంపల్లి సిరిని పాఠశాల తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి, విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూముల రాజేష్ మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

