గురుకులంలో విద్యార్థి అనుమానాస్పద మృతి
హాస్టల్లో ఉరివేసుకున్నట్లు అధికారుల వెల్లడి
అత్యవసరంగా పోస్టుమార్టం నిర్వహణపై అనుమానాలు
పూర్తిస్థాయి విచారణకు కుటుంబ సభ్యుల డిమాండ్
కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి చెందిన రచర్ల కార్తీక్ (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. అయితే కార్తీక్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. “నా కుమారుడు చిన్నప్పటి నుంచి హాస్టళ్లలోనే ఉంటూ చదువుకున్నాడు. వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు” అని కార్తీక్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కనీసం తాము రాకముందే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంలో ఆంతర్యమేమిటని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అది ఆత్మహత్యేనని ఏ ప్రాతిపదికన నిర్ధారించారని కళాశాల యజమాన్యాన్ని నిలదీశారు.
విచారణకు డిమాండ్..
విద్యార్థి మృతికి గల కారణాలను దాస్తున్నారని ఆరోపిస్తూ, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ అపశ్రుతి చోటుచేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

