జాతీయ రహదారిపై జర జాగ్రత్త!
గూడెప్పాడ్ వద్ద రోడ్డుపై భారీ గుంతలు
చీకటి పడితే ప్రయాణికుల విలవిల
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
కాకతీయ, ఆత్మకూరు: జాతీయ రహదారి (163)పై ప్రయాణం అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. మంగళవారం ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై భారీ లోతుగా గుంత ఏర్పడటంతో హనుమకొండ నుండి ములుగు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన జాతీయ రహదారి, నాణ్యత లోపం కారణంగానే ఇలా గుంతలమయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గూడెప్పాడ్ వ్యవసాయ మార్కెట్కు వెళ్లే ప్రధాన రహదారిపైనే ఈ భారీ గుంత ఉండటంతో రైతులకు శాపంగా మారింది. రాత్రి సమయాల్లో వెలుతురు సరిగ్గా లేకపోవడంతో బైక్ వాహనదారులు ఈ గుంతలో పడి గాయపడుతున్నారని, అధికారులు మాత్రం మొద్దునిద్రలో ఉన్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతులు ఎప్పుడో?
ఏదైనా పెను ప్రమాదం జరగకముందే ఆర్ అండ్ బి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్కు నిత్యం వందలాది వాహనాలు వస్తుంటాయని, ఈ సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ప్రయాణికులు మండిపడుతున్నారు.

