కార్మిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి
నైపుణ్యాభివృద్ధితోనే మెరుగైన ఉపాధి
టామ్ కామ్, ఏటీసీ సేవలను వినియోగించుకోవాలి
అదనపు కలెక్టర్ పి. శ్రీజ పిలుపు
కాకతీయ, మయూరి సెంటర్ : కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, వారి శ్రమను దోపిడీ చేయకుండా గౌరవించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మే డే’ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఏడాది కార్మిక శాఖ సాధించిన విజయాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు భావజాలానికి నిలయమని, హక్కుల కోసం పోరాడటం ఇక్కడి ప్రత్యేకత అని శ్రీజ పేర్కొన్నారు. ఎనిమిది గంటల పని విధానం కచ్చితంగా అమలు కావాలని, పని సమయం తర్వాత ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. మనిషిని మనిషిగా గౌరవించినప్పుడు ప్రత్యేక చట్టాల అవసరం తగ్గుతుందని, ప్రతి ఒక్కరూ ‘పని దైవం’ అనే భావనను ఆచరించాలని సూచించారు. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
నైపుణ్య శిక్షణతోనే భవిష్యత్తు
ప్రస్తుతం నైపుణ్యం ఉన్న వారికే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్కామ్, ఏటీసీ వంటి సేవలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విదేశీ ఉపాధి కోరుకునే వారికి భాషా శిక్షణ, స్థానిక నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో గత ఏడాది 7,498 మంది కార్మికులకు రూ.35.38 కోట్ల మేర సంక్షేమ ఫలాలు అందించామని వెల్లడించారు. కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అధికారులు పారదర్శకత పాటించాలని, అనర్హులకు లబ్ధి చేకూరకుండా చూడాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప కార్మిక శాఖ కమిషనర్ కె. విజయభాస్కర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. మాధవి, వివిధ శాఖల అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

