దేశ విభజన వాదులకు గుణపాఠం
దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో గుణపాఠం
కార్యకర్తల పోరాటాలు త్యాగాలతోనే బెంగాల్లో బీజేపీకి అధికారం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, కరీంనగర్ : ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్ లో పీఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే బెంగాల్ లో అధికారం దక్కిందని, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
భద్రతా వైఫల్యం స్పష్టం
కరీంనగర్ జువెలరీ షాపు ఘటనలో గాయపడ్డ బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని బండి సంజయ్ పేర్కొన్నారు. సేల్స్ మేనేజర్ కు, మధుకర్ కు బుల్లెట్ గాయాలయ్యాయని, చికిత్స అందుతోందని వివరించారు. ఈ ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు. బీఆర్ఎస్ నేతలు బాధ్యత వహిస్తూ తనను రాజీనామా చేయమనడం పెద్ద జోక్ అని కొట్టిపారేశారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమనే సోయి కూడా లేని వాళ్లను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజలు ఆలోచించుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
చొరబాటుదారులకు ఓటు హక్కు ఎందుకు?
బెంగాల్ ప్రజలు టీఎంసీ చెంప చెళ్లుమనిపించేలా తీర్పునిచ్చారని బండి సంజయ్ అన్నారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే తప్పేముందని ప్రశ్నించారు. దేశాన్ని అస్థిరపర్చే వారికి ఓటు హక్కు ఎందుకివ్వాలని నిలదీశారు. ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని ఎద్దేవా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

