పేద విద్యార్థుల చదువుకు ‘కపిల్’ భరోసా
అర్హులైన వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం
మే 15 వరకు అవకాశం.. 20న అర్హత పరీక్ష
కాకతీయ, కరీంనగర్ : పదో తరగతి పూర్తి చేసి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆదుకునేందుకు ‘కపిల్ విద్యా వారధి’ సంక్షేమ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి, కనీసం 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో స్థిరపడే వరకు అయ్యే పూర్తి ఖర్చులను భరించడంతో పాటు, వారికి మానసిక ధైర్యాన్ని, నైపుణ్య శిక్షణను అందించడమే ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ పథకం కోసం మే 20న (బుధవారం) కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ (గాయత్రీ నగర్) లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. పదో తరగతి సిలబస్ (గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, ఇంగ్లీష్) ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇందులో తల్లిదండ్రులు లేని వారు, సింగిల్ పేరెంట్ పిల్లలు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. ఉమ్మడి కరీంనగర్ కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చే వారికి ప్రయాణ ఖర్చులు రీయింబర్స్ చేయడంతో పాటు, పరీక్ష అనంతరం భోజన సదుపాయం కల్పిస్తారు.
అర్హులైన జిల్లాలు:
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు మే 15, 2026 లోపు www.kapilvidyavaradhi.org వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం అప్పిడి రాజిరెడ్డి (98485 26865), గీకురు శ్రీనివాస్ (99854 82292) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

