నిబంధనలు పాటించని స్కూళ్ల పర్మిషన్లు రద్దు చేయాలి
అడ్మిషన్ల పేరిట తల్లిదండ్రులను మోసం
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్
సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా విద్యాధికారికి వినతిపత్రం
కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, షిఫ్టింగ్ పర్మిషన్ (స్థల మార్పిడి అనుమతులు) లేకుండా నడుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిమాండ్ చేసింది. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే విద్యార్థుల మార్కులను తప్పుదోవ పట్టించేలా కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై అధిక ఫీజుల భారం మోపుతూ, పాఠ్యపుస్తకాలను తామే బలవంతంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు తగిన అర్హతలు ఉన్నాయా లేదా అన్నది అధికారులు తక్షణమే పరిశీలించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ‘బెస్ట్ అవైలబుల్ స్కీం’ కింద నడుస్తున్న పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులు కడుపునొప్పి, అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ చదువులో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందే
ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండాలని, ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, ఫ్యాన్లు కల్పించాలని ఎస్ఎఫ్ఐ నేతలు స్పష్టం చేశారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ సమస్యలన్నింటిపై జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యాధికారికి వినతిపత్రం సమర్పించిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి, జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల బాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

