కేయూ కాంట్రాక్ట్ అధ్యాపక సంఘానికి ఎన్నికలు జరపాలి
వైస్ ఛాన్సలర్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ల విన్నపం
కాకతీయ, హనుమకొండ : “విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, తమ సమస్యలను వినిపించాల్సిన సంఘానికి ఐదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదు” అని కాకతీయ యూనివర్సిటీ (కేయూ) అధ్యాపకులు పేర్కొన్నారు. తమ సంఘానికి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డికి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వినతిపత్రం అందజేశారు.
గత ఐదేళ్లుగా అసోసియేషన్కు ఎన్నికలు లేకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణకు యూనివర్సిటీ యంత్రాంగం సహకరించాలని కోరారు. ఈ విన్నపంపై వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాపరెడ్డి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అధ్యాపకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. పి. కరుణాకర్ రావు, డా. రంగారెడ్డి, డా. సాదు రాజేష్, డా. ఫిరోజ్ పాషా, డా. బి. సతీష్, డా. బిక్షపతి, డా. చంద్ర శేఖర్, డా. నాగయ్య, డా. శ్రీనివాస్, డా. సుచరిత పాల్, డా. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

