కొనుగోలు కేంద్రంలో రైతు వెంకటేశ్వర్లు మృతి
అలంకానిపేట ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
ఎండల్లో ఎదురుచూపులతో మానసికంగా కుంగిపోతున్న అన్నదాతలు
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి రైతులను పడిగాపులు పెట్టడం వల్లే నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. మరణించిన రైతు కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రస్తుత కఠినమైన ఎండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు, గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నరకం చూస్తున్నారన్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కల్లాల వద్దే ధాన్యానికి కాపలా కాస్తూ రైతులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో వడ్ల కాంటా కోసం తిరుగుతూ అలసిపోయిన వెంకటేశ్వర్లు గుండెపోటుతో మరణించడం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని విమర్శించారు.
అవినీతి వల్లే కొనుగోళ్లలో ఆలస్యం
కాపులకనపర్తి కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలు, అలంకానిపేట కేంద్రంలో వడ్లు విక్రయించేందుకు నెలరోజులుగా తిరుగుతున్నా కొనుగోళ్లు జరగకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం సేకరణపై ప్రతిపక్షాలు, రైతులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా పాలకులు స్పందించకపోవడం దారుణమన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్ నాయకుల మితిమీరిన జోక్యం, అవినీతి కారణంగానే ఈ ప్రక్రియ పూర్తిగా ఆలస్యమవుతోందని ఆరోపించారు. ఒకపక్క అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల వద్ద ఉన్న ప్రతీ గింజనూ వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

