సామాన్యుల ప్రాణాలకు విలువేది..?
చంపేసినా..పోస్టుమార్టం నివేదికలివ్వరా..?
అనుమానాస్పద మృతుల కేసుల్లో డీఎంహెచ్వో విచారణేది..?
వైద్యం పేరిట ప్రైవేటు ఆస్పత్రుల ఫక్తు వ్యాపారం
కరీంనగర్లో బయట పడుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల బాగోతం
రోగి చనిపోయినా గుట్టుగా చికిత్స.. ‘వన్’ హాస్పిటల్పై ‘ఠాగూర్’ తరహా ఆరోపణలు
అదే ఆసుపత్రిలో మంత్రి అడ్లూరికి ‘లిఫ్ట్’ ప్రమాదం..
మరునాడే తనిఖీల పేరుతో ఆరోగ్యశాఖ అధికారుల హడావుడి
యశోద కృష్ణ ఆసుపత్రిలోనూ మహిళ మృతి చెందితే కనీసం కన్నెతి చూడని డీఎంహెచ్వో
కాకతీయ, కరీంనగర్ : ప్రాణం పోయాల్సిన వైద్య రంగం.. కరీంనగర్ జిల్లాలో కాసులు కురిపించే వ్యాపారంగా మారిపోయింది. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య నిర్లక్ష్యం, అడ్డగోలు బిల్లులు, భద్రతా లోపాలు ఇప్పటికే ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నింపగా.. తాజాగా నగరంలో చోటుచేసుకున్న వరుస ఘటనలు ప్రైవేట్ వైద్యు ల అసలు రూపాన్ని బట్టబయలు చేశాయి. సామాన్య రోగుల మరణాలను దాచిపెట్టి డబ్బులు గుంజే అరాచకాలు ఒకవైపు.. కనీస భద్రత లేక సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఆసుపత్రి లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రమాదాలు మరోవైపు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో కరీంనగర్లోని ‘వన్ హాస్పిటల్’ లో చోటుచేసుకున్న ఘోరం ‘ఠాగూర్’ సినిమా దృశ్యాలను తలపించింది. వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన సాహెబ్ బీ (60) అనే మహిళ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆమె మృతి చెందినప్పటికీ.. కుటుంబ సభ్యులకు ఆ నిజం చెప్పకుండా ఐసీయూలో ఉంచి చికిత్స పేరిట అడ్డగోలుగా బిల్లులు వసూలు చేశారని ఎంఐఎం నాయకులు, బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆసుపత్రి ఎదుట రోగుల బంధువులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సదరు ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
అదే ఆసుపత్రిలో మంత్రికి ‘లిఫ్ట్’ గండం!
రోగి మృతి వ్యవహారంలో వివాదాల్లో ఉన్న అదే ‘వన్ హాస్పిటల్’ లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురికావడం ఆసుపత్రుల భద్రతా లోపాలకు అద్దం పడుతోంది. ఆసుపత్రిలో ఉన్న ఒక రోగిని పరామర్శించేందుకు మంత్రి వెళ్లారు. మంత్రి ఎక్కిన లిఫ్ట్.. సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కిందకు జారిపోయింది. మంత్రి కొద్దిసేపు అందులోనే చిక్కుకుపోగా, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పర్యవేక్షణ, ఫైర్ సేఫ్టీ, లిఫ్ట్ ఫిట్నెస్ లేని ఇలాంటి ఆసుపత్రుల్లో సామాన్యుల ప్రాణాలకు గ్యారెంటీ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
సామాన్యుడి ప్రాణం చౌకనా? వీఐపీలకేనా రక్షణ?
మంత్రికి ప్రమాదం జరగ్గానే కదిలిన అధికార యంత్రాంగం మరునాడే ఆస్పత్రుల్లో సేఫ్టీపై నానా హడావుడి చేసింది. అంతకుముందు సామాన్య మహిళ వైద్య నిర్లక్ష్యంతో చనిపోతే ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతో, శస్త్ర చికిత్సలు వికటించి రోగులు మృతి చెందుతున్నట్లుగా ఆరోపణలు వచ్చిన కేసుల్లో పోస్టు మార్టం నిర్వహించకుండా ఉండటం గమనార్హం. డీఎంహెచ్ స్థాయి అధికారి స్థాయి ఆస్పత్రిని విజిట్ చేయడంతో పాటు రిపోర్ట్ చేయాల్సి ఉండగా..ఇవేవీ జరగడం లేదు. సామాన్యుల ప్రాణాలకు విలువ లేదన్నట్లుగా ఆరోగ్యశాఖ వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఇటీవల నగరంలోని ‘యశోద కృష్ణ ఆసుపత్రి’లోనూ ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి చెందింది. బాధితులు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరిగారు. రోగి ప్రాణాలకు వెల కట్టి ఎంతోకొంత ముట్టజెప్పి ఆస్పత్రి యాజమాన్యం.. అన్యాయం చేసి చేతులు కడిగేసుకుంది.
కరీంనగర్లో కమీషన్ రాకెట్
గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు ఒక పెద్ద ‘కమిషన్ రాకెట్’ నడుపుతున్నాయి. గ్రామాల్లోని కొందరు ఆర్ఎంపీలతో కుమ్మక్కై, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే రోగులను భయపెట్టి నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయిస్తున్నారు. ఇలా పంపినందుకు సదరు ఆర్ఎంపీలకు భారీగా కమిషన్లు ముడుతున్నట్లు స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రస్తావించడం గమనార్హం. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై, అర్హత లేని సిబ్బంది నిర్వహణపై తక్షణమే ఉన్నతాధికారుల బృందంతో సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

