బీటీపీఎస్ బూడిద వర్షం
కాలుష్య కోరల్లో పినపాక, మణుగూరు పల్లెలు!
శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులతో విలవిల్లాడుతున్న పరిసర గ్రామాల ప్రజలు
తెల్లారేసరికి కుప్పలుగా బూడిద.. చెరువులు, కాలువలు కలుషితం..
వ్యవసాయం సాగక లబోదిబోమంటున్న రైతాంగం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యాజమాన్యం
పట్టించుకోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
సీఎస్ఆర్ నిధులు పక్కదారి.. కాలుష్య నివారణ చర్యలు శూన్యం
‘మా ప్రాణాలు పోయాక స్పందిస్తారా?’.. ఉష్ణోగ్రతల పెరుగుదలపై జనం ఆగ్రహం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక – మణుగూరు మండలాల సరిహద్దుల్లో నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇప్పుడు స్థానిక ప్రజల పాలిట శాపంగా మారింది. విద్యుత్ వెలుగులు నింపాల్సిన ఈ ప్లాంట్, పరిసర గ్రామాల్లో కాలుష్య చీకట్లను రగిలిస్తోంది. ప్లాంట్ నుంచి నిరంతరం వెలువడుతున్న బూడిద కారణంగా చుట్టుపక్కల పల్లెలు ఊపిరాడక విలవిలలాడుతున్నాయి. కాలం చెల్లిన పాత పద్ధతుల్లో ప్లాంట్ను నిర్వహించడం వల్లే ఈ స్థాయిలో వాతావరణ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటున్నా.. అటు యాజమాన్యం గానీ, ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తెల్లారేసరికి బూడిద వర్షం.. రోగాల బారిన జనం!
ప్లాంట్ పరిసర గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఉదయం లేచేసరికి తమ ఇళ్లు, వాకిళ్లు బూడిద పొరలతో కప్పబడి ఉండటాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. గాలిలో కలిసిపోతున్న ఈ సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరడంతో చిన్న పెద్ద తేడా లేకుండా వందలాది మంది శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా బారిన పడుతున్నారు. కంటిపై ఈ బూడిద పడటంతో చూపు సమస్యలు, చర్మంపై పడటంతో వింత చర్మవ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, పిల్లలను స్కూళ్లకు పంపాలన్నా జనం ప్రాణభయంతో వణికిపోతున్నారు.
జలవనరులు కలుషితం.. చేతులెత్తేస్తున్న రైతన్న!
బూడిద ప్రభావం కేవలం మనుషులపైనే కాదు.. ఇక్కడి జీవనాధారమైన వ్యవసాయాన్ని కూడా దెబ్బతీస్తోంది. పరిసరాల్లోని చెరువులు, కుంటలు, సాగునీటి కాలువలు పూర్తిగా బూడిదతో నిండిపోయి నీరంతా రసాయనమయంగా మారుతోంది. ఈ కలుషిత నీటిని వాడటం వల్ల పంటలు ఎదిగే దశలోనే తెగుళ్ల బారిన పడి ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించినా పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో రైతులు అప్పులపాలై ఆర్థికంగా కుంగిపోతున్నారు. భూగర్భ జలాలు సైతం కలుషితమై తాగునీటికీ తిప్పలు తప్పడం లేదు.
సీఎస్ఆర్ నిధులు ఏమౌతున్నాయి..?
నిబంధనల ప్రకారం ప్లాంట్ నుంచి వచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను స్థానిక గ్రామాల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేయాలి. కానీ, బీటీపీఎస్ యాజమాన్యం ఆ నిధులను ఇక్కడి పనులకు కేటాయించడం లేదని స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. కనీసం రోడ్ల పక్కన మొక్కలు నాటడం, కాలుష్యాన్ని అడ్డుకునేలా గ్రీన్ బెల్ట్ నిర్మించడం, రోడ్లపై నీళ్లు చల్లడం వంటి కనీస చర్యలను కూడా యాజమాన్యం గాలికొదిలేసిందని మండిపడుతున్నారు.
ప్లాంట్ను మూసివేయాలని డిమాండ్!
ఈ ప్లాంట్ నుంచి వెలువడుతున్న మితిమీరిన వేడి వల్ల ఈ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమ శాతం పడిపోయి పొడి వాతావరణం ఏర్పడుతోంది. “మా ప్రాణాలు పూర్తిగా పోయాక ప్రభుత్వం స్పందిస్తుందా?” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఆధునిక సాంకేతికతతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ ప్లాంట్ను మూసివేయాలంటూ స్థానికులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

