కరీంనగర్లో కల్తీ కబళం
‘విషాహారం’తో ప్రజల ప్రాణాలతో చెలగాటం!
మిఠాయిలపై బల్లి విసర్జన వ్యర్థాలు..
ఫ్రైడ్రైస్లో పురుగులు పట్టిన కుళ్లిన గుడ్లు
తనిఖీల్లో వెలుగుచూస్తున్న దారుణాలు
నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికొదిలేసిన వైనం
కేవలం నోటీసులు, జరిమానాలతోనే సరిపెడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు
కఠిన శిక్షలు, కేంద్రాల సీజింగ్ ఉంటేనే అక్రమార్కుల్లో వణుకు వచ్చే అవకాశం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో ఆహార భద్రత రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రజలు ఎంతో నమ్మకంతో, రుచి కోసం వెళ్తున్న స్వీట్ హౌస్లు, బేకరీలు, పేరున్న రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నేడు ‘విషాహార’ నిలయాలుగా మారుతున్నాయి. నిబంధనలను, కనీస పరిశుభ్రతను పూర్తిగా గాలికొదిలేసి నాసిరకం, కుళ్లిపోయిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేస్తూ నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల నగరంలో వరుసగా వెలుగుచూస్తున్న కల్తీ ఆహార ఘటనలు నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విద్యానగర్, బస్టాండ్ పరిసరాలు, కోర్టు రోడ్డు, వివేకానంద నగర్ వంటి ప్రధాన కూడళ్లలోని ఆహార కేంద్రాలు కమీషన్ల కక్కుర్తితో నాణ్యతను తుంగలో తొక్కుతున్నాయి.

బల్లి విసర్జనల నుంచి కుళ్లిన గుడ్ల వరకు
ఇటీవల నగరంలోని ఒక ప్రముఖ స్వీట్ హౌస్లో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మిఠాయిల నిల్వలపై బల్లి విసర్జన వ్యర్థాలు కనిపించడం కలకలం రేపింది. కిచెన్ పరిసరాలలో ఈగలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మరో పెద్ద బేకరీలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు, కేకుల తయారీకి వాడే కుళ్లిన క్రీములను అధికారులు గుర్తించి ధ్వంసం చేయించారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలలో క్యాన్సర్కు దారితీసే రసాయన రంగుల (సింథటిక్ ఫుడ్ కలర్స్) వాడుక బహిరంగంగానే సాగుతోంది. వీటన్నింటికంటే దారుణంగా ఒక నిత్యం రద్దీగా ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కుళ్లిపోయి, లోపల పురుగులు పట్టిన నల్లటి గుడ్లతో ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడుల్స్ తయారు చేస్తుండటాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్గా గుర్తించారు. ఆ గుడ్ల నుంచి తీవ్ర దుర్వాసన వస్తున్నా, వాటిని పారేయకుండా కస్టమర్ల కడుపు కొట్టేందుకు సిద్ధమవడం నగరంలో కలకలం రేపింది. రెండు, మూడు రోజుల కిందటి నిల్వ ఉంచిన చికెన్, మటన్ ముక్కలను ఫ్రిజ్లలో ఉంచి, ఆర్డర్ రాగానే వేడి నూనెలో వేసి కస్టమర్లకు వడ్డించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.

నామమాత్రపు జరిమానాలు..
గత ఏడాది కాలంలో జిల్లా ఆహార భద్రతాధికారులు నగరవ్యాప్తంగా వివిధ హోటళ్లు, తయారీ కేంద్రాల నుంచి 300 ఆహార నమూనాలను సేకరించారు. వీటిలో 280 నమూనాలకు సంబంధించిన ల్యాబ్ పరీక్షల నివేదికలు వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన, నాసిరకం ఆహారాన్ని అమ్ముతున్న ల్యాబ్ నివేదికల ఆధారంగా నిర్వాహకులకు కేవలం రూ. 3.36 లక్షల జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నారు. మొత్తం 21 కేసులు నమోదు కాగా, అందులో కేవలం 8 కేసులు మాత్రమే ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి. అయితే ఈ నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేయడం వల్లే నిర్వాహకుల్లో ఎలాంటి భయం కలగడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తనిఖీలు జరిగిన మరుసటి రోజు నుంచే మళ్లీ పాత పద్ధతిలోనే అపరిశుభ్ర వాతావరణంలో దందాను కొనసాగిస్తున్నారు. నిధుల వసూళ్లే ధ్యేయంగా సాగుతున్న ఈ జరిమానాల పర్వం వల్ల ఆహార నాణ్యతలో ఎలాంటి మార్పు రావడం లేదని, అధికారుల పనితీరు కూడా అనుమానాస్పదంగా మారిందని నగరవాసులు విమర్శిస్తున్నారు.

చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఇవే..
ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 ప్రకారం అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేయడం, మానవ ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను నిల్వ చేయడం తీవ్రమైన నేరం. చట్టంలో ఉన్న నిబంధనలు మరియు శిక్షల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి (లైసెన్స్) లేకుండా వ్యాపారం సాగిస్తే ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. లక్ష వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాల విక్రయాలకు ఏడాది జైలు శిక్ష, రూ. 3 లక్షల వరకు జరిమానా ఉంటుంది. కల్తీ ఆహారం వల్ల కస్టమర్లు తీవ్ర అనారోగ్యం బారిన పడితే నిర్వాహకులకు ఆరేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించే వీలుంది. కల్తీ లేదా విషాహారం తిని ఎవరైనా మరణిస్తే సదరు హోటల్ యాజమాన్యానికి చట్టం ప్రకారం జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇంతటి కఠినమైన చట్టాలు అందుబాటులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు మాత్రం శూన్యంగా మారింది. కేవలం కాగితాలకే పరిమితమైన నోటీసులు, జరిమానాలతో సరిపెట్టకుండా, నిబంధనలు ఉల్లంఘించే ఫుడ్ సెంటర్లను తక్షణమే సీజ్ చేయాలని, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కరీంనగర్ నగరవాసులు, ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

