ప్రతి కుటుంబానికి ఉచిత జీవిత బీమా
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ప్రభుత్వ బడుల్లో అల్పాహార పథకం!
అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
వరంగల్ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని పిలుపు
ఘనంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ జిల్లా స్థాయి సదస్సు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా వరంగల్ హంటర్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో శుక్రవారం భారీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా జరిగిన ఈ సదస్సులో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ను ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘ప్లాస్టిక్ నిషేధం – మన వరంగల్ పరిరక్షణ’ ప్రత్యేక సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్, ఎమ్మెల్సీలు ఫొటోలు దిగి, ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఉచిత జీవిత బీమా’
సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా (ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి) జీవిత బీమా కల్పించే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోందని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే “అల్పాహారం పథకం” తీసుకువస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో స్వచ్ఛమైన ప్రజాపాలన సాగుతోందని కొనియాడారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. వరంగల్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించడం అభినందనీయమన్నారు.
జూన్ 12 వరకు మరింత సమర్థవంతంగా పనిచేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికలో భాగంగా 10 కీలక అంశాలపై గ్రామీణ, మండల స్థాయిల్లో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. జూన్ 12 వరకు అధికారులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజల మెప్పు పొందాలని ఆదేశించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ, వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ సారంగపాణి, అదనపు కలెక్టర్లు జి. సంధ్యారాణి, గణేష్, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం మరియు వివిధ మండలాల తహశీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

