సీఎంఆర్ఎఫ్ చెక్కుల మాయాజాలం!
గడువు ముగిసినా లబ్ధిదారులకు అందని సహాయం..
చెక్కులు మాయం.. అధికారుల నిర్లక్ష్యమా? లేక పెద్ద స్కామా?
పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ప్రజల ఆగ్రహం
బాధ్యులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో ఉండి, వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన అత్యవసర నిధుల చెక్కులే గల్లంతవుతున్నాయన్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. లబ్ధిదారులకు చేరకముందే ఆ చెక్కుల గడువు ముగిసిపోయిన ఉదంతాలు వెలుగులోకి రావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన సీఎంఆర్ఎఫ్ నిధులు మధ్యలోనే మాయం కావడం వెనుక ఎవరి హస్తం ఉందన్న చర్చ మండలవ్యాప్తంగా జోరందుకుంది.
అధికారుల నిర్లక్ష్యమా.. రాజకీయ దందానా?
ఈ చెక్కులు అసలు ఎక్కడ మాయమయ్యాయి? ఎవరి టేబుళ్లపై నెలల తరబడి ఆగిపోయాయి? ఇది అధికారుల ఘోర నిర్లక్ష్యమా? లేక రాజకీయ జోక్యంతో వెనుక నుంచి నడుస్తున్న పెద్ద దందానా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆసుపత్రి ఖర్చుల కోసం ఆశగా ఎదురుచూసిన పేద కుటుంబాలకు ఈ ఘటన తీవ్ర ఆవేదనను మిగుల్చుతోంది. ప్రాణాలు నిలబెట్టే ప్రభుత్వ సహాయం కూడా సమయానికి అందకపోతే పేదల పరిస్థితి ఏంటని బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. కొందరు లబ్ధిదారులకు తమ పేరిట చెక్కు మంజూరైందన్న సమాచారం తెలిసినప్పటికీ, అది చేతికి అందకుండానే గడువు ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్థాయి విచారణ జరపాలి
మండలంలో ఒక్కటి కాదు.. మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా మాయమైనట్లు సమాచారం బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత అనుమానాస్పదంగా మారింది. దీంతో ప్రజలు “ఇది సాధారణ తప్పిదం కాదు.. పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న దారుణమైన నిర్లక్ష్యం” అంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాయమైన చెక్కుల పూర్తి వివరాలను బయటపెట్టాలని, గడువు ముగిసిన చెక్కుల స్థానంలో వెంటనే కొత్త చెక్కులను జారీ చేసి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, వెనుక ఉన్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలని వేములవాడ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

